Adibatla kidnap case: నా కుమార్తె విషయంలో నవీన్ రెడ్డి సైకోలా వ్యవహరించాడు..: యువతి తండ్రి ఫిర్యాదు

ప్రేమించిన అమ్మాయి మరొకరితో పెళ్లికి సిద్ధపడిందని ఆ యువతిని ప్రియుడు అపహరించుకుపోయిన సంఘటన రాష్ట్ర రాజధాని శివారు మన్నెగూడలో శుక్రవారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

Updated : 10 Dec 2022 14:13 IST

హైదరాబాద్: ప్రేమించిన అమ్మాయి మరొకరితో పెళ్లికి సిద్ధపడిందని ఆ యువతిని ప్రియుడు అపహరించుకుపోయిన సంఘటన రాష్ట్ర రాజధాని శివారు మన్నెగూడలో శుక్రవారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై యువతి తండ్రి దామోదర్‌రెడ్డి ఫిర్యాదుతో ఆదిభట్ల పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న నవీన్‌ రెడ్డి, అతని అనుచరులపై ఆదిభట్ల పోలీసులు హత్యాయత్నం, అపహరణ, దాడితో పాటు పలు కేసులు నమోదు చేశారు.

‘‘బొంగుళూరులోని ఓ బ్యాడ్మింటన్‌ శిక్షణ కేంద్రంలో నా కుమార్తెకు నవీన్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. ప్రేమ, పెళ్లి పేరుతో రెండేళ్లుగా నా కుమార్తెను వేధించారు. నిన్న నవీన్‌రెడ్డి రూబెన్‌, మరో 50 మంది అనుచరులు నా ఇంటిపై దాడి చేశారు. కారులో ఐరన్‌ రాడ్లు, రాళ్లు తీసుకొని ఇంటికి వచ్చారు. నా కుమార్తె, మా కుటుంబసభ్యులను చంపాలని ఇంట్లోకి దూసుకొచ్చారు. నవీన్‌రెడ్డి.. నా తలపై రాడ్డుతో దాడి చేశారు. నా స్నేహితులు మధ్యలోకి వస్తే వారిపైనా దాడి చేశారు. దాడి తర్వాత నా కుమార్తెను బలవంతంగా కారులో ఎక్కించుకొని ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఉన్న సామగ్రి, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.

నవీన్ రెడ్డి సైకోలా వ్యవహరించాడు..

నా కూమార్తె విషయంలో మొదటి నుంచి నవీన్ రెడ్డి సైకోలా వ్యవహరించాడు. తనను సొంతం చేసుకోవాలని ఎన్నో డ్రామాలు ఆడాడు. నా కుమార్తెతో వివాహం జరిగినట్లు నమ్మించేందుకు ఎన్నో కుట్రలు చేశాడు. ఈ మేరకు గతేడాది ఆగస్టు 27వ తేదీన నా కుమార్తెతో వివాహమైందని ప్రచారం చేసుకున్నాడు. నా భార్యను పంపించడం లేదంటూ ఎల్బీనగర్ కోర్టులో నవీన్‌రెడ్డి పిటిషన్ వేశాడు. ఓ వాహనం కొనుగోలు చేసి అందులో నామినీగా భార్య పేరు స్థానంలో నా కుమార్తె పేరు రాయించుకున్నాడు. ఆ పత్రాలను ఆధారంగా చూపించి కోర్టులో పిటిషన్ వేశాడు. ఆగస్టు 27న అనారోగ్యం కారణంగా నా కుమార్తె ఆస్పత్రిలో ఉంది. నా కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందిన బిల్లులే ఇందుకు నిదర్శనం. నవీన్ రెడ్డి పెళ్లి విషయంలో అబద్ధం చెబుతున్నాడు. నా కూతురుతో కలిసి దిగిన ఫొటోలను నవీన్ రెడ్డి పెళ్లి ప్రచారానికి వాడుకున్నాడు. నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో పలువురికి ఆ ఫొటోలను పంపించాడు’’ అని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కిడ్నాప్‌పై గవర్నర్ ఆరా..

యువతి కిడ్నాప్‌ ఉదంతంపై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. యువతి, కుటుంబం భద్రత కోసం చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. యువతి కుటుంబీకులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పరామర్శించారు. యువతి తండ్రిని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని