Hyderabad: బేగంబజార్‌ హత్య కేసు.. అదుపులో ఆరుగురు నిందితులు

నగరంలోని బేగంబజార్‌ పరువుహత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నీరజ్‌‌ హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అభినందన్‌,

Published : 21 May 2022 21:52 IST

హైదరాబాద్: నగరంలోని బేగంబజార్‌ పరువుహత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నీరజ్‌‌ హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అభినందన్‌, విజయ్‌, సంజయ్‌, రోహత్‌, మహేశ్, ఒక బాలుడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ జోయల్‌ డేవిస్‌ మీడియాకు వెల్లడించారు.

డీసీపీ మాట్లాడుతూ.. ‘‘సంజన పెద్దనాన్న కుమారులు నీరజ్‌ను చంపేశారు. నీరజ్‌ను హత్య చేసేందుకు గాను 15 రోజులుగా కుట్ర చేశారు. నిందితులు జుమేరాత్‌ బజార్‌లో కత్తులు కొన్నారు. నీరజ్‌ కదలికలను గత కొన్ని రోజులుగా పరిశీలించారు. నీరజ్‌ ప్రేమ వివాహం చేసుకొని షంషేర్‌నగర్‌లో ఉంటున్నారు. నీరజ్‌, సంజన ప్రేమ వివాహం యువతి ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. వివాహం అనంతరం సంజనతో ఎలాంటి సంబంధం లేదని ఆమె కుటుంబసభ్యులు వదిలేశారు. పెద్దనాన్న కుమారులు మాత్రం పరువు పోయినట్లు భావించారు. ప్రాణాపాయం ఉందని గతేడాది పెళ్లి చేసుకున్నప్పుడే నీరజ్‌, సంజన ఫిర్యాదు చేశారు. అప్పుడే ఇరు వర్గాలను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించాం.

నీరజ్‌ వాళ్లకు పల్లీల వ్యాపారం ఉంది. నీరజ్‌ ఎక్కువగా షాపుకు రావడం.. నిందితుల ఇల్లు కూడా సమీపంలోనే ఉండటం వల్ల ఈ మధ్య వారు ఎక్కువగా ఎదురు పడటం జరిగింది. పదే పదే నీరజ్‌ను ఇంటి సమీపంలో చూసి నిందితులు తట్టుకోలేకపోయారు. అలా ఆవేశంలో, తాగిన మత్తులో తీసుకున్న నిర్ణయం ప్రకారం నీరజ్‌ను హతమార్చారు. నిందితుడిగా గుర్తించిన వారిలో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసులో సంజన కుటుంబసభ్యుల ప్రమేయం ఇప్పటివరకు బయటపడలేదు. ప్రస్తుతం ఆరుగురు కలిసి హత్య చేసినట్లు గుర్తించాం. నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. తద్వారా ఈ కేసులో ఇంకెవరికైనా ప్రమేయం ఉందా అనే విషయం తేలుతుంది. పరువు హత్య అన్నట్లు ఆధారాలు లభించలేదు’’ అని డీసీపీ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు