Uttarakhand: రిసార్టులో రిసెప్షనిస్ట్‌ హత్య.. భాజపా నేత కుమారుడి అరెస్ట్‌

ఉత్తరాఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ రిసార్టులో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న 19ఏళ్ల యువతి హత్యకు గురికావడం కలకలం రేపింది.

Updated : 24 Sep 2022 15:10 IST

పౌరీ: ఉత్తరాఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ రిసార్టులో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న 19ఏళ్ల యువతి హత్యకు గురికావడం కలకలం రేపింది. అయితే, ఈ వ్యవహారంలో రిసార్టు యజమానే ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడైంది. దీంతో అతడితోపాటు అదే రిసార్టులో పనిచేస్తోన్న మరో ఇద్దరు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు.

ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌కు చెందిన వినోద్‌ ఆర్య అనే ఓ భాజపా నేతకు పౌరీ జిల్లాలో ఓ రిసార్టు ఉంది. అందులో పనిచేస్తున్న 19 ఏళ్ల యువతి గత కొంతకాలంగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఐతే ఆ యువతిని భాజపా నేత కుమారుడు, రిసార్టు యజమానిగా ఉన్న పులకిత్‌ ఆర్య, మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌లు కలిపి హతమార్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం మృతదేహాన్ని సమీప కాలవలో పడేసినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితులు చెప్పిన వివరాల ప్రకారం అమ్మాయి మృతదేహాన్ని కనుగొనేందుకు ప్రత్యేక బృందంతో కాలవలో గాలింపు చేపట్టినట్లు పౌరీ ఎసీపీ శేఖర్‌ చంద్ర సుయాల్‌ వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా.. వారికి 14 రోజుల జుడీషియల్‌ కస్టడీ విధించినట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని