Khammam: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించాడు.. అంతలోనే సినిమా చూస్తూ కుప్పకూలాడు

తండ్రి తాపీ మేస్త్రీ పనులు, తల్లి కూలి పనులు చేస్తూ ఆ యువకుడిని చెమటోడ్చి చదివించారు. కష్టపడి ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేసిన ఆ యువకుడు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించాడు.

Updated : 11 Mar 2023 08:52 IST

మధిర గ్రామీణం, న్యూస్‌టుడే: తండ్రి తాపీ మేస్త్రీ పనులు, తల్లి కూలి పనులు చేస్తూ ఆ యువకుడిని చెమటోడ్చి చదివించారు. కష్టపడి ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేసిన ఆ యువకుడు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించాడు. వారం రోజుల్లో కొలువులో చేరాల్సి ఉంది. అంతలోపే ఆ యువకుడు.. గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా మధిర మండలం నక్కలగరుబు గ్రామానికి చెందిన కొట్టే పెద్దకృష్ణ, రాధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. రెక్కల కష్టంపై బతికే ఆ దంపతులు ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేశారు. ఒక్కగానొక్క కుమారుడైన కొట్టే మురళీకృష్ణ(26)ను కష్టపడి చదివించారు. బీటెక్‌ చదివిన మురళీకృష్ణ హైదరాబాద్‌లోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూనే సాఫ్ట్‌వేర్‌ రంగానికి సంబంధించి ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అనంతరం ఇటీవలనే మురళీకృష్ణకు హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ కొలువు వచ్చింది. ఈ నెల 17న ఆ ఉద్యోగంలో చేరాల్సి ఉంది.

దీంతో కొన్ని రోజుల క్రితమే ఎంతో సంతోషంగా సొంతూరికి వచ్చిన ఆయన.. అమ్మానాన్నలకు శుభవార్త చెప్పి ఆనందం పంచుకున్నారు. ఇక తమ కష్టాలు తొలిగిపోయాయని, అందరి బాధ్యతా తానే తీసుకుంటానని చెప్పి తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్న మురళీకృష్ణ గురువారం సాయంత్రం స్నేహితులతో కలిసి థియేటర్‌కు వెళ్లాడు. కష్టకాలంలో కొలువు వచ్చినందుకు తల్లిదండ్రులూ పొంగిపోయారు. సరదాగా సినిమా చూస్తున్నవాడు చూస్తున్నట్టే హఠాత్తుగా పడిపోయాడు. స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. కొడుకు మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటాడని అనుకుంటే తమను వదిలిపోయాడంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరులను కలిచివేశాయి. నక్కలగరుబు గ్రామంలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని