Tragedy: గుజరాత్‌లో ఘోరం.. తీగల వంతెన కూలి 78మంది మృతి

గుజరాత్‌(Gujarat)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మోర్బీ పట్టణంలో కేబుల్‌ బ్రిడ్జి(Cable Bridge) కుప్పకూలిన ఘటనలో 78 మంది ప్రాణాలు కోల్పోయినట్టు మంత్రి ప్రకటించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Updated : 31 Oct 2022 01:46 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌(Gujarat)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మోర్బీ పట్టణంలో కేబుల్‌ బ్రిడ్జి(Cable Bridge) కుప్పకూలడంతో తలెత్తిన పెను విషాదంలో మృతుల సంఖ్య 78కి చేరింది. ఈ విషయాన్ని అక్కడ స్వయంగా సహాయక చర్యలు చేపడుతున్న స్థానిక ఎమ్మెల్యే, గుజరాత్‌ మంత్రి బ్రిజేశ్‌ మెజ్రా వెల్లడించారు. వందేళ్ల క్రితం మచ్చూ నదిపై నిర్మించిన ఈ తీగల వంతెన ఆదివారం మధ్యాహ్నం తెగిపోవడంతో భారీ సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. వంతెన తెగిన సమయంలో దానిపై 500 మంది ఉండగా.. వీరిలో 100 మందికి పైగా నదిలో మునిగిపోయారు.  వీరిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఘటనా స్థలానికి బయల్దేరిన సీఎం.. మృతులకు పరిహారం ప్రకటన

మరోవైపు, ఈ ఘటనతో తన అన్ని కార్యక్రమాలూ రద్దు చేసుకొని మోర్బీకి బయల్దేరినట్టు గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ వెల్లడించారు. అక్కడి పరిస్థితిని నేరుగా సమీక్షించనున్నట్టు తెలిపారు. ఈ ఘటనలో మృతిచెందిన వారికి తన ప్రగాఢ సంతాపం ప్రకటించిన సీఎం.. ఆ కుటుంబాలకు గుజరాత్‌ ప్రభుత్వం తరఫున పరిహారం ప్రకటించారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.4లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటిస్తూ ట్వీట్‌ చేశారు. మరోవైపు, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతులకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటిస్తూ పీఎంవో ట్వీట్‌ చేసింది. 

కారణం ఇదేనా?

దాదాపు వందేళ్ల క్రితం నాటి ఈ వంతెనకు ఇటీవలే మరమ్మతులు పూర్తి చేసి తిరిగి ప్రజల సందర్శన కోసం తెరిచారు. అది జరిగిన నాలుగైదు రోజులకే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆదివారం సాయంత్రం పెద్ద సంఖ్యలో జనం ఈ వంతెనపై నిలబడటంతో సామర్థ్యానికి మించి బరువు కావడం వల్ల కూలినట్టుగా సమాచారం. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి బ్రిజేశ్‌ మెజ్రా మాట్లాడుతూ.. ‘‘ఈ తీగల వంతెన కూలిపోవడంతో పలువురు నదిలో పడిపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొందరికి గాయాలైనట్టు తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలించారు’’ అని తెలిపారు. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ తీగల వంతెన కూలిపోయిన సమయంలో దానిపై పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నారు. 

రాష్ట్రపతి విచారం.. గుజరాత్‌ సీఎంకు ప్రధాని ఫోన్‌ 

ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.  తీగల వంతెన కూలిపోయిన విషయం తెలిసి గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌తో పాటు పలువురు అధికారులకు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి మాట్లాడారు.  యుద్ధ ప్రాతిపదికన సహాయక బృందాలను తరలించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించినట్టు పీఎంవో కార్యాలయం ట్వీట్‌ చేసింది. అలాగే, ఈ ఘటనపై కాంగ్రెస్‌ పార్టీ విచారం వ్యక్తం చేసింది. నదిలో పడిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తూ ఈ ఘటన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ విషాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడి మంత్రులు, అధికారులతో మాట్లాడారు. అవసరమైన తక్షణ సాయం అందించాలని సూచించారు.

మరోవైపు, ఈ ఘటనపై గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్యసాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. దీనిపై సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడినట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. 

వంతెన చరిత్ర..

ఈ వంతెన 1879 ఫిబ్రవరి 20న బాంబే గవర్నర్‌ రిచర్డ్‌ టెంపుల్‌ ప్రారంభించారు. అప్పట్లో రూ.3.5లక్షల వ్యయంతో దీని నిర్మాణం పూర్తి చేశారు. ఈ వంతెన నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ ఇంగ్లాండ్‌ నుంచి తెప్పించారు. దర్బార్‌గఢ్‌ -నాజర్‌బాగ్‌ను కలుపుతూ నిర్మించిన ఈ వంతెనకు దాదాపు 140 ఏళ్ల చరిత్ర ఉంది. దీని పొడవు 765 అడుగులు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని