Shocking incident: ఫుల్‌గా తాగొచ్చి.. బిర్యానీతో పాటు నగలూ మింగేశాడు!

విచిత్రమైన ఘటన ఒకటి వెలుగుచూసింది. ఫుల్‌గా తాగి ఈద్‌ పార్టీకి వెళ్లిన ఓ వ్యక్తి ఆ మైకంలో బిర్యానీతో .....

Updated : 12 May 2022 16:36 IST

(ఫైల్‌ ఫొటో)

చెన్నై: చెన్నై నగరంలో విచిత్రమైన ఘటన ఒకటి వెలుగుచూసింది. ఫుల్‌గా తాగి ఈద్‌ పార్టీకి వెళ్లిన ఓ వ్యక్తి ఆ మైకంలో బిర్యానీతో పాటు రూ.1.45లక్షల విలువ చేసే నగల్నీ మింగేశాడు. చివరకు వైద్యులు ఎనిమా ఇచ్చి అతడి పొట్టలోంచి నగల్ని బయటకు తీశారు. మే 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నగల దుకాణంలో పనిచేసే ఓ మహిళ ఈ నెల 3న తన ఇంట్లో ఈద్‌ పార్టీకి స్నేహితురాలితో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌నీ ఆహ్వానించింది. విందుకు వచ్చిన అతిథులందరికీ బిర్యానీ వడ్డించగా.. తప్పతాగి ఉన్న తన స్నేహితురాలి బాయ్‌ఫ్రెండ్‌ (32 ఏళ్లు) ఆ ఇంటి కబోర్డులో ఉన్న డైమండ్‌ నెక్లెస్‌, బంగారం చైన్‌, చెవి పోగులను మింగేశాడు. విందు పూర్తయి.. అతిథులంతా వెళ్లిపోయాక కబోర్డులోని ఆభరణాలు అదృశ్యమైనట్టు గుర్తించిన ఇంటి యజమాని.. అతిథులను సంప్రదించింది. అప్పటికీ తెలియకపోవడంతో చివరకు తన స్నేహితురాలి బాయ్‌ ఫ్రెండ్‌పై అనుమానం వచ్చి విరుగంబక్కం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మరుసటి రోజు మే 4న అతడిని పోలీసులు విచారించగా.. నేరం అంగీకరించాడు. దీంతో వైద్యుడి వద్దకు తీసుకెళ్లి స్కానింగ్‌ చేయగా పొట్టలో నగలు ఉన్నట్టు గుర్తించారు. వైద్యులు గురువారం అతడికి ఎనిమా ఇచ్చి రూ.95వేలు విలువ చేసే నెక్లెస్‌, రూ.25వేలువ చేసే బంగారు గొలుసును బయటకు తీశారు. డైమండ్‌ పెండెంట్‌ ఇంకా పొట్టలోనే ఉండిపోవడంతో విరేచనం మందు ఇచ్చారు. తాగిన మత్తులోనే ఇదంతా చేశాడని తెలియడంతో ఆ మహిళ తన ఫిర్యాదును ఉపసంహరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని