Telangana News: సీఐడీ డీజీ గోవింద్ సింగ్ కారు బోల్తా.. ఆయన భార్య మృతి

తెలంగాణ సీఐడీ పోలీసు డీజీ గోవింద్ సింగ్ కారు బోల్తా పడింది. రాజస్థాన్‌లో జరిగిన ఈ  ఘటనలో ఆయన భార్య షీలా సింగ్‌ అక్కడిక్కడే మృతి చెందారు.

Updated : 10 Oct 2022 22:19 IST

జైసల్మేర్‌: తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్ సింగ్ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయన సతీమణి షీలా సింగ్‌ అక్కడిక్కడే మృతి చెందారు. డీజీ సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. డీజీ గోవింద్ సింగ్ తన భార్యతో కలిసి రాజస్థాన్‌లోని మాతేశ్వరి తనోతరాయ్ మాత ఆలయాన్ని సందర్శించడానికి కారులో వెళ్లారు. తిరుగుప్రయాణంలో రామ్‌గఢ్ ప్రాంతంలో ఉన్న ఘంటియాలీ మాత ఆలయం సమీపంలోకి రాగానే ఆయన కారు ఒక్కసారిగా బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న డీజీ గోవింద్ సింగ్ భార్య షీలా సింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. డీజీ గోవింద్ సింగ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ విజయేందర్‌ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని జవహర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డీజీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

డీజీపీ దిగ్భ్రాంతి

సీఐడీ డీజీ గోవింద్ సింగ్ భార్య షీలా సింగ్‌ మృతి పట్ల తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను సంబంధిత పోలీసులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన డీజీ గోవింద్ సింగ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని