Crime news: ఠాణే హత్య కేసు.. మృతదేహాన్ని ఎలా మాయం చేయాలో గూగుల్‌లో సెర్చ్‌!

ఠాణేలో జరిగిన క్రూర హత్య కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భాగస్వామి సరస్వతిని చంపడానికి ముందు నిందితుడు శవాన్ని మాయం చేసేందుకు అనుసరించాల్సిన పద్ధతులను గూగుల్‌లో సెర్చ్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

Updated : 10 Jun 2023 20:25 IST

ఠానే: మహారాష్ట్రలోని ఠాణేలో సహజీవన భాగస్వామి సరస్వతి వైద్య (36) హత్యోదంతం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితుడు మనోజ్‌ సానె(55)ని అరెస్టుచేసిన పోలీసులు అతడు అంతకుముందు చెప్పినవన్నీ అబద్ధాలేనని తేల్చారు. సరస్వతిని హత్య చేయడానికి ముందు ఆమె శరీర భాగాలను ఎలా మాయం చేయాలి? దుర్వాసన రాకుండా ఏం చేయాలనే అంశాలను తెలుసుకొనేందుకు నిందితుడు గూగుల్‌లో వెతికినట్టు పోలీసులు గుర్తించారు. 

ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు పలువురిని విచారిస్తున్నారు. సరస్వతిని చంపిన తర్వాత నిందితుడు గాయాలతో ఉన్న ఆమె మృతదేహాన్ని ఫొటో తీశాడని పోలీసులు తెలిపారు. చంపేముందు ఆమె శరీర భాగాలను ఎలా పారేయాలి? దుర్వాసన రాకుండా ఏం చేయాలని తెలుసుకొనేందుకు గూగుల్‌లో సెర్చ్‌ చేశాడని గుర్తించామన్నారు. అలాగే, కొన్ని వీడియోలను కూడా చూశాడని చెప్పారు. ఒక వెబ్‌ సిరీస్‌ చూసిన మనోజ్‌.. అదే తరహా ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు.  సరస్వతిని హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడికించాక మూడు బకెట్లలో కుక్కాడని పోలీసులు వివరించారు. ఈ కేసులో మనోజ్‌ ఇచ్చిన ప్రాథమిక సమాచారం అంతా అవాస్తవమని నిర్థారించారు.   అరెస్టు తర్వాత తాను, సరస్వతి అనాథలమని పోలీసులకు చెప్పాడు. అయితే, గురువారం ముగ్గురు మహిళలు సరస్వతి సోదరిలమంటూ పోలీసులను ఆశ్రయించారు. తాము ఐదుగురమని.. అందరికంటే సరస్వతి చిన్నదని వివరించారు. దీంతో నిజానిజాలను ధ్రువీకరించేందుకు పోలీసులు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి  వారందరినీ అక్కాచెల్లెల్లుగా నిర్థారించి మృతదేహాన్ని వారికి అప్పగించారు. మనోజ్‌కు  ముంబయిలో బంధువులు ఉన్నట్టు విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు.  అతడికి హెచ్‌ఐవీ ఉందా? లేదా అనేది పోలీసులు ఇంకా వెల్లడించలేదు. 

సరస్వతి వైద్య, మనోజ్‌ సహానీ గత మూడేళ్లుగా ఠానేలోని మరా రోడ్డులో ఓ ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. బుధవారం వారి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పొరుగింటివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అపార్టుమెంట్‌కు వచ్చిన పోలీసులు అక్కడ పరిశీలించగా మహిళ శరీర భాగాలు లభించాయి. ముక్కలు ముక్కలుగా నరికిన భాగాలు కనిపించాయని పోలీసులు తెలిపారు.  నిందితుడు మనోజ్‌ బెడ్‌రూమ్‌లో భారీ ప్లాస్టిక్‌ బ్యాగులతో పాటు చెట్లు నరికే యంత్రాన్ని పోలీసుల సీజ్‌ చేశారు. ప్రెజర్‌ కుక్కర్‌తో పాటు గిన్నెల్లో శరీర భాగాలను ఉడకబెట్టినట్టు గుర్తించారు. ఇంకొన్ని భాగాలను మిక్సీలో వేసినట్టు గుర్తించారు. మహిళకు చెందిన మరికొన్ని శరీర భాగాలను కిచెన్‌ సింక్‌, బకెట్లలో గుర్తించారు. వాటన్నింటినీ స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలులో హాజరుపరచగా.. న్యాయస్థానం అతడిని జూన్‌ 16వరకు పోలీస్‌ కస్టడీకి అప్పగించింది.

ఇప్పటికీ అంతా షాక్‌లోనే ఉన్నాం.. 

ఈ కిరాతక ఘటన గురించి  తెలిసి ఇప్పటికే తామంతా షాక్‌లోనే ఉన్నామని ఆకాశ్‌దీప్‌ బిల్డింగ్‌ సొసైటీ కార్యదర్శి ప్రతాప్‌ ఆశ్వాల్ అన్నారు. ఇప్పటికీ అక్కడ ఉండేవాళ్లంతా తీవ్ర షాక్‌లోనే ఉన్నారన్నారు. ఆ ఫ్లాట్‌ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ దుర్వాసన వస్తుండటంతో మొత్తం కాంప్లెక్స్‌ను శానిటైజ్‌ చేస్తున్నామన్నారు.  ఈ దారుణ ఘటనతో సొసైటీ మేనేజ్‌మెంట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అద్దెకు ఉండే వారి గుర్తింపు, నేపథ్యాన్ని ధ్రువీకరించే విషయంలో మరింత కఠినంగా ఉండాలని నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని