Train accident: ఘోరం.. పట్టాలు తప్పిన బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ .. 233 మందికి పైగా మృతి

Rail Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం అనూహ్య రీతిలో జరిగిన రైలు ప్రమాదంలో 233 మంది దుర్మరణం పాలయ్యారు.

Updated : 03 Jun 2023 08:50 IST

బాలేశ్వర్‌: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం(Train accident) జరిగింది. బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం అనూహ్య రీతిలో జరిగిన రైలు ప్రమాదంలో 233 మంది దుర్మరణం పాలయ్యారు. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

స్థానిక అధికారుల కథనం ప్రకారం- బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. వాటిని షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దాంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదం అక్కడితో ఆగిపోలేదు. బోల్తాపడ్డ కోరమండల్‌ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది.

ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు. ఈ ఘటనతో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను మళ్లించినట్టు అధికారులు వెల్లడించారు.

మృతులకు ₹10లక్షల ఎక్స్‌గ్రేషియో.. రైల్వేమంత్రి ప్రకటన

ఒడిశా రైలు ప్రమాదంలో మృతులకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. మృతులకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.2లక్షలు, స్వల్ప గాయాలు అయిన వారికి రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. 

సహాయక చర్యలు ముమ్మరం

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ షాలిమార్‌ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు పెద్ద సంఖ్యలో అంబులెన్స్‌లను పంపారు. బాలేశ్వర్‌లో ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. బాధితుల సమాచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 06782262286కు ఫోన్‌ చేయాలని అధికారులు తెలిపారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, నాలుగు రాష్ట్ర సహాయక బృందాలు రంగంలోకి దించారు. దాదాపు 60 అంబులెన్సులను ఘటనా స్థలానికి తరలించినట్టు సమాచారం. అలాగే, బాలేశ్వర్‌లోని వైద్య కళాశాలలు, ఆస్పత్రులను అధికారులు అప్రమత్తం చేశారు.

బెంగాల్‌-ఒడిశా-ఆంధ్రప్రదేశ్‌-తమిళనాడు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే ఈ రైలు షెడ్యూల్‌ ప్రకారం ప్రతి రోజూ షాలిమార్‌లో మధ్యాహ్నం 3.20గంటలకు బయల్దేరుతుంది. సంత్రగాచి జంక్షన్‌, ఖరగ్‌పూర్‌ జంక్షన్‌, బాలేశ్వర్‌, భద్రక్‌, జాస్పూర్‌ కె రోడ్‌, కటక్‌, భువనేశ్వర్‌, ఖుర్దా రోడ్‌, బ్రహ్మపూర్‌, విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ మీదుగా మరుసటి రోజు సాయంత్రం 4.50గంటలకు చెన్నైకు చేరుకుంటుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు