Viveka Murder case: ఎంత డబ్బు కావాలో చెప్పు.. దస్తగిరికి బంపర్‌ ఆఫర్‌

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి

Updated : 22 Feb 2022 17:57 IST

పులివెందుల: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి గత సెప్టెంబరు 30న సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదు వివరాలు ఇవాళ వెలుగులోకి వచ్చాయి. పులివెందుల కోర్టులో ఇవాళ నలుగురు నిందితులకు సంబంధించి అభియోగ పత్రాలు, ఫిర్యాదులను కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు సంబంధిత న్యాయవాదులకు అందజేశారు. అందులో భాగంగా దస్తగిరి సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదు బయటకు రావడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

గతేడాది ఆగస్టు 31న ప్రొద్దుటూరు కోర్టులో సెక్షన్‌ 164 కింద దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత... సీబీఐకి ఎలాంటి వివరాలు తెలియజేకుండా, మభ్య పెట్టేవిధంగా, అతన్ని లొంగదీసుకునేందుకు వైకాపాకు చెందిన కొందరు అతన్ని సంప్రదించినట్టు దస్తగిరి ఫిర్యాదు రూపంలో సెప్టెంబరు 30న సీబీఐకి అందజేశాడు. అందులో ప్రధానంగా వైఎస్‌ అవినాష్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న పులివెందులకు చెందిన భరత్‌ యాదవ్‌ తరచూ తన ఇంటికి వచ్చే వాడని, సీబీఐకి ఎలాంటి వివరాలు చెప్పావు, ఏం స్టేట్‌మెంట్‌ ఇచ్చావు.. ఆ వివరాలన్నీ అవినాష్‌రెడ్డికి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తెలియజేయాలని వేధిస్తున్నాడని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో దస్తగిరి తెలిపాడు. తాను.. సీబీఐ నిఘాలో ఉన్నానని, ఎక్కడికీ రాలేనని దస్తగిరి చెప్పినట్టు వివరాల్లో నమోదై ఉంది.

‘‘దస్తగిరి ఇంటి వెనుక ఉన్న పులివెందుల భాక్రాపురంలోని హెలిపాడ్‌ వద్దకు రమ్మని చెప్పడంతో దస్తగిరి అక్కడికి వెళ్లాడు. భరత్‌ యాదవ్‌, న్యాయవాది అక్కడికి వచ్చి ఈ విషయాలు ఎక్కడా చెప్ప వద్దు నీకు 10 లేదా.. 20 ఎకరాల భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇచ్చేందుకు ప్రముఖులు సిద్ధంగా ఉన్నారు. వివేకా హత్యకేసుకు సంబంధించిన విషయాలు సీబీఐకి చెప్పొద్దు. ఇప్పటివరకు సీబీఐకి ఎలాంటి వివరాలు చెప్పావో అవన్నీ మాకు తెలియజేయాలి’’ అని ఒత్తిడి చేసినట్టు దస్తగిరి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తర్వాత మరోసారి కూడా భరత్‌ యాదవ్‌ తన ఇంటికి వచ్చి అవినాష్‌రెడ్డి తోట వద్దకు రావాలి, అన్న పిలుస్తున్నాడని చెప్పినట్టు సమాచారముంది. పులివెందులలో తాను ఎక్కడెక్కడ తిరుగుతున్నది, ఎవరిని కలుస్తున్నది భరత్‌ యాదవ్‌ నిఘాపెట్టి ఫాలో అవుతున్నాడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాజాగా ఈ వివరాలు బయటకు రావడం సంచలనంగా మారింది. వివేకా హత్యకేసు విచారణ పులివెందుల కోర్టు నుంచి కడప కోర్టుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని