Prayagraj: కుమార్తె మృతదేహంతో ఐదు రోజులుగా ఇంట్లోనే.. బతికించేందుకు క్షుద్రపూజలు

ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగరాజ్​లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. కుమార్తె మృతదేహాన్ని ఐదు రోజులుగా ఇంట్లోనే దాచిపెట్టిన తల్లిదండ్రులు.........

Published : 30 Jun 2022 01:58 IST

లఖ్‌నవూ: ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగరాజ్​లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. కుమార్తె మృతదేహాన్ని ఐదు రోజులుగా ఇంట్లోనే దాచిపెట్టిన తల్లిదండ్రులు.. ఆమెను బతికించేందుకు క్షుద్రపూజలు చేశారు. మృతదేహం కుల్లిపోయి వాసన వస్తున్నప్పటికీ క్షుద్రపూజలు కొనసాగించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ప్రయాగ్‌రాజ్‌లోని కర్చన ప్రాంతం దిహా గ్రామానికి చెందిన అంతిమ యాదవ్‌ (18) ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. అయితే ఈ విషయాన్ని కుటుంబసభ్యులు బయటకు పొక్కనీయలేదు. ఇంట్లో గడియ పెట్టుకొని ఆమెను బతికించేందుకు ఓ మాంత్రికుడితో కలిసి క్షుద్రపూజలు చేయించారు. ఐదు రోజులుగా మృతదేహాం అలాగే ఉండటంతో కుళ్లిపోయి దుర్వాసన వచ్చింది. దీన్ని గమనించిన చుట్టుపక్కవారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వచ్చిన పోలీసులు.. ఇంటి లోపలకు వెళ్లి అక్కడ జరుగుతున్న దృశ్యాలను చూసి షాకయ్యారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఐదు రోజులుగా ఆ కుటుంబీకులు ఏమీ తినకుండా గంగాజలం తాగుతూ క్షద్రపూజల్లో పాల్గొన్నట్లు సమాచారం. ఏమీ తినకపోవడం, దుర్వాసన కారణంగా ఇంట్లోని మొత్తం 11మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వారందరినీ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల మానసిక పరిస్థితి బాగాలేదని, వారిని ముందుగా విచారించి ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని