crime news: మానవ మృగాలు! మూగ, చెవిటి బాలికపై అమానుషం

మధ్యప్రదేశ్‌ షాదోల్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఓ మూగ, చెవిటి బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా.....

Published : 02 Oct 2021 01:32 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ షాదోల్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఓ మూగ, చెవిటి బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా.. ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. కొత్వాలి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మూగ, చెవిటి బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఓ యువకుడు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లాడు. అప్పటికే అక్కడ మరో ఐదుగురు కాపు కాస్తున్నారు. అనంతరం మొత్తం ఆరుగురు ఆ అభాగ్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీశారు.

అనంతరం బాధితురాలిని ఇంటివద్ద వదిలేశారు. తనకు జరిగిన అన్యాయంపై బాలిక ఇంట్లో చెప్పుకోలేపోయింది. అయితే సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫొటోలు వెలుగుచూడటంతో విషయం తండ్రికి తెలిసింది. కుమార్తెను ఆరా తీయగా ఆమె బోరుమంది. తనపై జరిగిన రాక్షసకాండను తల్లిదండ్రులకు వివరించింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బాలికను విచారించగా పలు సంజ్ఞల ద్వారా వారికి కూడా విషయాన్ని తెలియజేసింది. దీంతో పలు అనుమానితుల ఫొటోలను పోలీసులు బాలికకు చూపించగా.. నిందితులను ఆమె గుర్తించింది. ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్‌ అవధేశ్‌ గోస్వామి వెల్లడించారు. అయితే అందులో నలుగురు మైనర్లేనని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని