
Emergency Landing: విమానం మెడికల్ ఎమర్జెన్సీ ల్యాండ్.. ప్రయాణికుడి మృతి
ఇండోర్: కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి దిల్లీకి వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. వెంటనే విమానాన్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. విస్టారా విమానం యూకే- 818 గురువారం సాయంత్రం బెంగళూరు నుంచి దిల్లీకి బయల్దేరింది. ఈ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న దిల్లీకి చెందిన మనోజ్ కుమార్ అగర్వాల్కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. కొద్ది సేపటికే మూర్చపోవడంతో.. ఈ మేరకు సమాచారం అందుకున్న పైలట్లు వెంటనే విమానాన్ని దారి మళ్లించారు.
రాత్రి 9.30 గంటల సమయంలో ఇండోర్లోని దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయంలో మెడికల్ ఎమర్జెన్సీ కింద ల్యాండ్ చేశారు. ఎయిర్పోర్ట్ ఇన్ఛార్జి డైరెక్టర్ ప్రమోద్ కుమార్ శర్మ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వెంటనే బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. గుండెపోటుకు గురై మృతి చెందినట్లు తెలుస్తోందని ఆ ఆసుపత్రి డైరెక్టర్ డా.సునీల్ బాంతియా చెప్పారు. పోస్ట్మార్టం అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఏరోడ్రోమ్ పోలీస్స్టేషన్ అధికారి తెలిపారు.
ఇవీ చదవండి
Advertisement