Cyber Fraud: ఫ్రీ థాలీ కోసం ఆశపడితే.. రూ.90వేలు పోయే..!

Cyber Fraud: ఆఫర్ కోసం పోయి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుందో మహిళ. వారి మాటలు నమ్మి ఆన్‌లైన్‌ లింక్‌పై క్లిక్ చేసి భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకుంది. 

Published : 27 May 2023 15:01 IST

దిల్లీ: ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ.. ఇలాంటి ఆఫర్లు ఎప్పుడూ మనసును లాగేస్తూనే ఉంటాయి. అలాగైనా ఖర్చు తగ్గించుకోవచ్చని చూస్తాం. కానీ అక్కడే సరిచూసుకోకపోతే బోల్తా కొట్టడం ఖాయం. అదే పరిస్థితి దిల్లీకి చెందిన ఓ మహిళా ఉద్యోగిని(Delhi Woman)కి ఎదురైంది. ఫ్రీ థాలీ(Free Thali) కోసం ఒక లింక్ మీద క్లిక్‌ చేసి, రూ.90 వేలు పోగొట్టుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..(Cyber Fraud)

బాధితురాలు ఓ బ్యాంక్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌. ఫేస్‌బుక్‌ పోస్టు ద్వారా ఆమెకు థాలీ ఆఫర్ గురించి తెలిసింది. ఒక థాలీ కొంటే ఇంకో థాలీ ఫ్రీ అని పోస్టు సారాంశం. ఆ వివరాలు తెలుసుకునేందుకు సదరు సైట్‌లోకి వెళ్లి, అందులో ఉన్న ఫోన్‌ నంబర్‌కు కాల్‌  చేశారు. అయితే ఆమె కాల్‌కు ఎలాంటి స్పందనా రాలేదు. ఆ తర్వాత ఆమెకు ఆ నంబర్ నుంచి కాల్‌ వచ్చింది. ఒక ప్రముఖ రెస్టారంట్‌ నుంచి అదనంగా థాలీ పొందచ్చని ఆ ఆఫర్ వివరాలను తెలిపారు.

‘తర్వాత కాలర్ ఒక లింక్ షేర్ చేశారు. దాని ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఆఫర్ పొందచ్చని చెప్పారు. అందుకోసం ముందుగా రిజిస్టర్ కావాలన్నారు. ఆ యాప్‌లోకి వెళ్లి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేశా. ఇంక అంతే.. నా ఫోన్‌పై నాకు నియంత్రణ లేకుండా పోయింది. అది హ్యాక్ అయింది. వెంటనే రూ.40వేలు డెబిట్ అయ్యాయని సందేశం వచ్చింది. ఆ తర్వాత రూ.50 వేలు డెబిట్‌ అయ్యాయని మరో సందేశం వచ్చింది. నా క్రెడిట్‌ కార్డు నుంచి నా పేటీఎం ఖాతాకు, ఆ తర్వాత నకిలీ ఖాతాకు డబ్బులు బదిలీ అయ్యాయి. అసలు నేను ఆ వివరాలు ఏవీ వారికి ఇవ్వలేదు. అయినా డబ్బు అలా బదిలీ కావడం చూసి ఆశ్చర్యపోయా. వెంటనే క్రెడిట్ కార్డును బ్లాక్ చేశా’ అని ఆమె తెలిపారు. ఒకవైపు ఈ కేసు దర్యాప్తు జరుగుతోన్న సమయంలోనే .. వేరే నగరాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.

మరోపక్క ఆ ప్రముఖ రెస్టారంట్‌ చైన్‌ ప్రతినిధిని సంప్రదించగా.. ‘ఈ మోసపూరిత ప్రకటన గురించి మాకు ప్రజలనుంచి చాలా కాల్స్‌ వచ్చాయి. మే అలాంటి ఆఫర్లు ఏమీ ప్రకటించలేదు. దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలి’ అని వెల్లడించారు. ‘సైబర్ నేరగాళ్లు వేర్వేరు మార్గాల ద్వారా ప్రజలను మోసగించాలని చూస్తున్నారు. గుర్తు తెలియని లింకులు, యాప్‌లపై క్లిక్‌ చేయొద్దు’ అని సైబర్‌క్రైమ్ విభాగం అధికారులు హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని