Drugs Case: 3వ తేదీ రాత్రి పుడింగ్‌ పబ్‌లో ఏం జరిగింది?.. రిమాండ్‌ రిపోర్టులో వెల్లడి

బంజారాహిల్స్‌ రాడిసన్‌ బ్లూ ప్లాజాలోని పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసులో పోలీసులు నాంపల్లి కోర్టులో రిమాండ్ రిపోర్టు దాఖలు చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే

Published : 07 Apr 2022 01:40 IST

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రాడిసన్‌ బ్లూ ప్లాజాలోని పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసులో పోలీసులు నాంపల్లి కోర్టులో రిమాండ్ రిపోర్టు దాఖలు చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే పబ్‌ మేనేజర్‌ అనిల్‌, నిర్వాహకుడు అభిషేక్‌ మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్టు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. పుడింగ్‌ పబ్‌లో రోజూ తెల్లవారుజామున 4గంటల వరకు మద్యం, మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్టు పోలీసులు సమాచారం తెలుసుకున్నారు. పక్కా ప్రణాళికతో 3వ తేదీ తెల్లవారుజామున పబ్‌పై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కౌంటర్‌ వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న ట్రేలలో స్ట్రాలు, టిష్యూ పేపర్లు, టూత్‌ పిక్స్‌ను గమనించారు. అదే ట్రేలో అనుమానాస్పద ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో తెల్లటి పౌడర్‌ను గమనించిన పోలీసులు స్వాధీనం చేసుకుని పరీక్షించగా కొకైన్‌గా తేలింది.4.6 గ్రాముల కొకైన్‌ ఉన్నట్టు గుర్తించారు. ల్యాప్‌ టాప్‌, ప్రింటర్‌, వేయింగ్‌ మిషన్‌తో పాటు ప్యాకింగ్‌ మెటీరియల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 ఇవన్నీ పబ్‌ మేనేజర్‌ అనిల్‌ పర్యవేక్షణలో ఉన్నట్టు తెలుసుకొని అతన్ని ప్రశ్నించారు. అనిల్‌ ఇచ్చిన సమాచారం మేరకు పబ్‌ నిర్వాహకుడు అభిషేక్‌ను పిలిపించారు. ఇద్దరినీ ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసి వాళ్ల వద్ద ఉన్న చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. పబ్‌లో కిరణ్‌రాజు, అర్జున్‌ వీరమాచినేని కూడా భాగస్వాములుగా ఉన్నట్టు గుర్తించి పోలీసులు వాళ్లపైనా కేసులు నమోదుచేశారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ పరారీలో ఉన్నట్టు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. పామ్‌ అనే యాప్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వాళ్లకే పబ్‌లోకి అనుమతి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రూ.50వేల రుసుము కడితేనే యాప్‌లో లాగిన్‌ అయ్యే అవకాశం కల్పిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. 3వ తేదీ రాత్రి జరిగిన పార్టీలో వేర్వేరు బృందాలుగా ఏర్పడి దాదాపు 150మంది వరకు పబ్‌కు వచ్చారు. వీళ్లలో ఏ బృందం కొకైన్‌ తీసుకుందనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అనిల్‌ అభిషేక్‌లను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మాదక ద్రవ్యాలకు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని