మాజీ మంత్రికి ఆరో పెళ్లి.. కేసు పెట్టిన మూడో భార్య..!

ఆరోసారి పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ మాజీ మంత్రికి అతడి మూడో భార్య షాకిచ్చింది. ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ పెళ్లిని అడ్డుకొని అతడిపై కేసు నమోదు చేశారు.

Published : 03 Aug 2021 01:09 IST

లఖ్‌నవూ: ఆరోసారి పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ మాజీ మంత్రికి అతడి మూడో భార్య షాకిచ్చింది. ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ పెళ్లిని అడ్డుకొని అతడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి చౌదరి బషీర్‌ ఆరోసారి వివాహానికి సిద్ధమయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న అతడి మూడో భార్య నగ్మా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బషీర్‌తో తనకు 2012లో వివాహమైందని ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లయ్యాక తనను భౌతికంగా, మానసికంగా హింసించినట్టు వివరించింది. మహిళలను హింసించడం అతడికి చాలా ఇష్టమంటూ ఆమె ఆరోపించింది. చౌదరి బషీర్‌ మరో వివాహం చేసుకుంటున్నట్టు తనకు గత నెల 23న సమాచారం అందిందని, దీనిపై నిలదీయడంతో తనను తీవ్రంగా హింసించడంతో పాటు ట్రిపుల్‌ తలాక్‌ రూపంలో విడాకులు ఇచ్చి ఇంట్లోంచి బయటకు పంపించారని తెలిపింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా.. ఆ వివాహాన్ని అడ్డుకోవడంతోపాటు ముస్లిం మహిళా వివాహ చట్టం కింద పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. గతంలోనూ అతడిపై ఈ తరహా కేసు నమోదవగా.. 23 రోజుల పాటు జైల్లో గడిపాడు. చౌదరి బషీర్‌ గతంలో సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని