Hyderabad News: స్థిరాస్తి వ్యాపారులపై కాల్పులు.. ఇద్దరి మృతి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో కాల్పులు కలకలం రేపాయి. కర్ణంగూడ గ్రామ సమీపంలో స్కార్పియో

Updated : 01 Mar 2022 13:22 IST

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో కాల్పులు కలకలం రేపాయి. కర్ణంగూడ గ్రామ సమీపంలో స్కార్పియో వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాస్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి రాఘవేందర్‌రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతిచెందారు.

వివరాల్లోకి వెళితే.. ఈ ఉదయం కర్ణంగూడకు వెళ్లే మార్గంలో స్థానికులు ఓ స్కార్పియో వాహనాన్ని గుర్తించారు. కారుపై రక్తపు మరకలు ఉండటంతో దగ్గరికి వెళ్లి చూడగా అందులోని ఓ వ్యక్తి స్పృహలో లేకపోవడాన్ని గమనించారు. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వ్యక్తిని హైదరాబాద్‌ బీఎన్‌రెడ్డిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో గాలించగా అప్పటికే మృతిచెందిన శ్రీనివాస్‌రెడ్డి కనిపించారు. అతడి స్వగ్రామం అల్మాస్‌గూడగా గుర్తించారు. 

బాధితుడిని పరీక్షించిన వైద్యులు అతడి ఛాతీ కింద భాగంలో బుల్లెట్‌ గాయమైందని.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం చికిత్స పొందుతూ రాఘవేందర్‌రెడ్డి ఆస్పత్రిలో మృతిచెందారు. వాహనం నంబర్‌ ఆధారంగా బాధితుడు అంబర్‌పేటకు చెందిన స్థిరాస్తి వ్యాపారిగా గుర్తించారు. అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారంలో వీరికి ఏమైనా గొడవలున్నాయా? కాల్పులు జరపడానికి ఇంకేమైనా కారణాలున్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మృతులు శ్రీనివాస్‌రెడ్డి, రఘు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పటేల్‌గూడలోని 22 ఎకరాల్లో శ్రీనివాస్‌రెడ్డి, రఘు, మట్టారెడ్డి వెంచర్‌ వేశారు. వెంచర్‌ విషయంలో ఈ ముగ్గురి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెల్లవారుజామున ఐదు గంటలకు శ్రీనివాస్‌రెడ్డి, రఘు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. వెంచర్‌ విషయంలో మాట్లాడదామని వీరిద్దరినీ మట్టారెడ్డి పిలిపించారంటూ బాధితుల కుటుంబ సభ్యులు తెలిపారు. కాల్పులకు అతడే కారణమని వారు అనుమానిస్తున్నారు. దీంతో మట్టారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఘటనాస్థలాన్ని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ పరిశీలించారు

ఈ ఉదయం శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి వెంచర్ వద్దకు వెళ్లారు. వెంచర్‌ సమీపంలో పాయింట్‌ బ్లాంక్‌లో శ్రీనివాస్‌రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పులతో భయపడిన రాఘవేందర్‌రెడ్డి కారులో పారిపోవడానికి యత్నించగా గుర్తు తెలియని వ్యక్తి అతడిని వెంబడించి కాల్పులు జరిపినట్లు సమాచారం. శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డిపై గతంలో కేసులున్నట్లు పోలీసులు తేల్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు