Hyderabad: పార్కింగ్‌ స్థలంలో బైక్‌లు చోరీ.. నలుగురు నిందితులు అరెస్టు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పార్కింగ్‌ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న నలుగురు నిందితులను కార్ఖానా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Published : 26 May 2023 20:21 IST

రెజిమెంటల్‌ బజార్‌: విలాసాలకు అలవాటు పడి నగరంలోని పలు ప్రాంతాల్లో పార్కింగ్‌ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న నలుగురు నిందితులను కార్ఖానా పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 14 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని వారిని రిమాండుకు తరలించారు. శుక్రవారం ఉత్తర మండల డీసీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బేగంపేట ఏసీపీ పృథ్వీధర్‌రావు, కార్ఖానా ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ వివరాలను వెల్లడించారు. 

‘‘బంజారాహిల్స్‌లోని శంకర్‌కాలనీకి చెందిన పి.పవన్‌ (22) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఖైరతాబాద్, ఆనంద్‌నగర్‌ కాలనీ వాసి గుగులోత్‌ హరిచంద్ర నాయక్‌(22) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వెంకటరమణ కాలనీ వాసి కె.వెంకన్న(23) కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉండే తూర్పు గోదావరి జిల్లా సామలకోట వాసి కక్కల దుర్గాప్రసాద్‌ (22)తో వెంకన్న స్నేహం ఏర్పడింది. వీరందరూ విలాసాలు, చెడు అలవాట్లతో చోరీలు బాటపట్టారు. ఇళ్ల ముందు పార్కింగ్‌ చేసిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని గత 3 నెలలుగా తాళాలు పగులగొట్టి, మారుతాళాలతో వాహనాలను చోరీలు చేస్తున్నారు. 

కార్ఖానా కాకాగూడలో నివాసం ఉండే కొంతం హరికృష్ణ తన బైక్‌ను ఈనెల 14వ తేదీన సొంతూరు గజ్వేల్‌కు వెళ్తూ అదే ప్రాంతంలో ఉండే ఐస్‌క్రీమ్‌ షాపు వద్ద పార్కింగ్‌ చేసి వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి చూడగా బైక్‌ కనిపించలేదు. దీంతో ఈనెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నార్త్‌జోన్‌ డీసీపీ చందనాదీప్తి ఆదేశాల మేరకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీ రికార్డుల ఆధారంగా నిందితులపై నిఘా ఉంచారు. ఈనెల 25న కార్ఖానా ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వీరి నుంచి 14 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నాం’’ అని తెలిపారు.

నిందితుల్లో పి.పవన్‌ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి 2022లో బంజారాహిల్స్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో రూ.15లక్షల విలువైన వజ్రాలను చోరీ చేసి పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఇతడు స్నేహితులతో కలిసి కార్ఖానా, దుండిగల్, పంజాగుట్ట, బాలానగర్, బేగంబజార్, ఎస్‌ఆర్‌ నగర్, ఓయూ పోలీసుస్టేషన్ల పరిధిలో ద్విచక్రవాహనాలను దొంగిలించారని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు