​​​​​​సూర్యాపేట కబడ్డీ పోటీల్లో అపశ్రుతి

సూర్యాపేటలో 47వ జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. మైదానంలో ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలి సుమారు 100

Updated : 23 Mar 2021 06:16 IST

సూర్యాపేట: సూర్యాపేటలో 47వ జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. మైదానంలో ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలి సుమారు 100 మందికి పైగా ప్రేక్షకులకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు, 108 సిబ్బంది క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ తరలించారు. ఆస్పత్రుల్లో క్షతగాత్రులను మంత్రి జగదీశ్‌ రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రమాద సమయంలో గ్యాలరీల్లో దాదాపు 1500 మంది ప్రేక్షకులు ఉన్నట్లు సమాచారం. సామర్థ్యానికి మించి ప్రేక్షకులు గ్యాలరీలో కూర్చోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. గ్యాలరీ కూలిపోవడానికి నిర్మాణంలో లోపమా? మరేదైనా కారణమా? అన్నది తేలాల్సి ఉంది. 

ఈ గ్యాలరీల ఏర్పాటుకు 90టన్నుల ఇనుము, 60టన్నుల కలపను వినియోగించారు. అలాగే, 20అడుగుల ఎత్తు, 240 అడుగుల వెడల్పుతో మూడు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీలో 5000 మంది కూర్చొనేలా మొత్తం 15వేల సామర్థ్యంతో  మూడు గ్యాలరీలు నిర్మించారు. వీటికి వినియోగించిన ఇనుపరాడ్లు కొందరి కాళ్లపై పడటంతో తీవ్ర గాయాలైనట్టు సమాచారం. జాతీయ స్థాయి జూనియర్‌ కబడ్డీ పోటీలు ఇప్పటివరకు ఎన్నడూ నల్గొండ ఉమ్మడి జిల్లాలో జరగలేదు.దీంతో ఈ పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మంగా నిర్వహించాలని భావించారు.ఈ క్రీడా పోటీల కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అయితే, ఎంత భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ క్రీడా పోటీలు మరికాసేపట్లో ఘనంగా ప్రారంభం కానున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం విషాదం నింపింది.

 

గ్యాలరీల్లో పరిమితికి మించి కూర్చోవడం వల్లే.. ఎస్పీ

సూర్యాపేటలో జాతీయ జూనియర్‌ కబడ్డీ పోటీల్లో చోటుచేసుకున్న అపశ్రుతి ఘటనపై జిల్లా ఎస్పీ భాస్కరన్‌ స్పందించారు. క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఎవరి పరిస్థితైనా విషమంగా ఉంటే చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తామని తెలిపారు. గ్యాలరీల్లో పరిమితికి మించి కూర్చోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని