Gaza: బర్త్‌ డే వేడుకల్లో పెను విషాదం.. ఒకే కుటుంబంలో 17మంది మృతి

గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబ సభ్యులంతా బర్త్‌ డే వేడుకల సందడిలో ఉండగా.. ఆ క్షణంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదానికి ఓ పెద్ద కుటుంబమే బలైపోయింది.

Published : 19 Nov 2022 02:22 IST

గాజా: గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబ సభ్యులంతా బర్త్‌ డే వేడుకల సందడిలో ఉండగా.. ఆ క్షణంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదానికి ఓ కుటుంబమే బలైపోయింది. అపార్ట్‌మెట్‌లో పెద్ద ఎత్తున ఎగసిపడిన అగ్నికీలల ధాటికి 21మంది బలైపోగా.. వీరిలో 17మంది ఒకే కుటుంబానికి చెందినవారు ఉండటం అందరినీ హృదయాలను కలిచివేస్తోంది. జబాలియా శరణార్థుల శిబిరం ప్రాంతంలో గురువారం రాత్రి ఓ మూడంతస్తుల భవనంలోని పైఅంతస్తులో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. అయితే, ఇంట్లో నిల్వ చేసిన పెట్రోల్‌ (gasoline) వల్లే ప్రమాదం చోటుచేసుకొని ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఈ పెట్రోల్‌ ఎలా మండిందనే అంశంపై మాత్రం స్పష్టత లేదని.. దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. 

రెండు వేడుకలు ఒకేచోట.. అంతా ఆనందం.. అంతలోనే విషాదం..

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా గాజా ప్రాంతం నిత్యం బాంబు మోతతో దద్దరిల్లుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కారణంగా చెలరేగిన హింస కాకుండా గత కొన్నేళ్లలో అత్యంత ఘోరమైన సంఘటన ఇదేనని అధికారులు పేర్కొంటున్నారు. అబు రాయ అనే వ్యక్తి కుటుంబం నివసిస్తున్న ఈ భవనంలోని పైఅంతస్తులో చెలరేగిన మంటలు అపార్ట్‌మెంట్‌ను పూర్తిగా ధ్వంసం చేశాయని తెలిపారు. ఈ ఘటనపై అబూ రయా కుటుంబానికి చెందిన మరో వ్యక్తి మహ్మద్‌ అబూరయా మాట్లాడారు. ఆ పెద్ద కుటుంబంలో ఒక చిన్నారి పుట్టిన రోజు వేడుకలతో పాటు ఈజిప్టు పర్యటన నుంచి ఒకరురావడంతో రెండు వేడుకలు ఒకేసారి నిర్వహించారు. ఈ వేడుకకు కుటుంబ మంతా ఒకేచోట చేరి ఆనందంగా గడుపుతున్న సమయంలో ఈ దుర్ఘటన ఆ కుటుంబాన్ని నాశనం చేసిందని వాపోయారు. బంధువుల రోదనలు మిన్నంటడంతో పాటు ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. వీరి మృతదేహాలను ఉత్తర గాజాలోని ఇండోనేషియా ఆసుపత్రిలో ఉంచినట్టు పేర్కొన్నారు.

ఏం జరిగిందో చెప్పేందుకు ఎవరూ మిగల్లేదు..

ఇంట్లో పెట్రోల్‌ నిల్వ చేయడం వల్లే మంటలు చెలరేగాయన్న వార్తల్ని కొట్టిపారేసిన మహ్మద్‌ అబూరయా.. ఫర్నిచర్‌ ఎక్కువగా ఉండటం వల్లే మంటలు తీవ్రత అధికంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ విపత్తు ఎలా జరిగిందో వాస్తవాలు చెప్పేందుకు ఎవరూ సజీవంగా మిగల్లేదని వాపోయారు. ఇది పెట్రోల్‌ నిల్వ చేయడం వల్ల జరిగిందని తాను అనుకోవడంలేదని తెలిపారు. మృతుల్లో అబూరయా కుటుంబంలో మూడు తరాలకు చెందినవారు ఉన్నట్టు పేర్కొన్నారు. 15ఏళ్ల క్రితం ఇస్లామిక్ మిలిటెంట్ హమాస్ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఇజ్రాయెల్-ఈజిప్టు సరిహద్దు దిగ్బంధనం కారణంగా గాజా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. శీతాకాలం కోసం ప్రజలు తరచూ ఇళ్లలో వంట గ్యాస్‌ ,డీజిల్‌, పెట్రోల్‌ నిల్వ చేసుకుంటుంటారు. గతంలో కొవ్వొత్తులు ,గ్యాస్‌ లీకేజీల వల్ల ఇళ్లలో మంటలు చెలరేగిన అనుభవాలు కూడా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు