పెళ్లికి తయారు.. వరుడు పరారు!

‘‘మన కులాలు వేరైనా మనం ఒకటే.. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నాం.. మా అమ్మానాన్నలను ఒప్పించా.. ఎల్లుండి ప్యారడైజ్‌ కన్వెన్షన్‌లో పెళ్లి.. నా పేరుమీద బుక్‌ చేశాను..ఉదయాన్నే మీ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులతో కలిసి వచ్చేయండి..

Published : 05 Jan 2020 07:14 IST

సహజీవనం చేసి మోసం

హైదరాబాద్‌: ‘‘మన కులాలు వేరైనా మనం ఒకటే.. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నాం.. మా అమ్మానాన్నలను ఒప్పించా.. ఎల్లుండి ప్యారడైజ్‌ కన్వెన్షన్‌లో పెళ్లి.. నా పేరుమీద బుక్‌ చేశాను..ఉదయాన్నే మీ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులతో కలిసి వచ్చేయండి.. పెళ్లయ్యాక ఇద్దరమే ముంబయి, దిల్లీకి వెళ్దాం... మా అమ్మ తనకున్న నగలన్నీ నీకే ఇచ్చేస్తానంటూ చెప్పింది... పెళ్లికి పట్టుచీర కూడా తీసుకువస్తానంది.. మా నాన్న మొదట్లో అభ్యంతరం చెప్పినా.. తర్వాత సరేనన్నారు. మన ఆఫీస్‌ సిబ్బంది అందరికీ ఫోన్‌ చేశాను. పెళ్లికి వచ్చే వారందరికీ   అల్పాహారం ఇవ్వాలంటూ హోటల్‌ వారిని అభ్యర్థించానం’’టూ ఒక యువకుడు.. తన ప్రియురాలికి ఫోన్‌ చేశాడు. అతడి మాటలు నమ్మి సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ కన్వెన్షన్‌కు కోటి ఆశలతో వెళ్లిన ఆ యువతి ఒక్కసారిగా అక్కడ పెద్ద తాళాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది..అక్కడున్న వారిని సంప్రదించగా.. పెళ్లి లేదు... నిశ్చితార్థం లేదు... వెళ్లండి అంటూ చెప్పారు. అక్కడి నుంచే తన ప్రియుడికి ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది.  తనను మోసం చేశాడని గ్రహించిన ఆమె సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించింది.

పనిచేసే చోట పరిచయం.. సికింద్రాబాద్‌లో నివాసముంటున్న యువతి బేగంపేటలోని బహుళజాతి కంపెనీలో ఐటీ విభాగంలో నాలుగేళ్లుగా పనిచేస్తోంది. అదే కంపెనీలో మాసాబ్‌ట్యాంక్‌లోని శాంతినగర్‌లో నివాసముంటున్న ప్రవీణ్‌ మూడేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు.  రెండున్నరేళ్ల క్రితం ప్రవీణ్‌ను కూడా ఐటీ విభాగంలోకి మార్చారు. అప్పటి నుంచి ప్రవీణ్‌ సదరు యువతితో మాట్లాడేవాడు.   ప్రవీణ్‌కు అవసరమైనప్పుడు ఆమె ఆర్థికంగా సాయపడేది.
పెళ్లి ప్రతిపాదన.. సహజీవనం...  తాను తన తల్లిదండ్రులను ఒప్పిస్తాననంటూ చెప్పడంతో ప్రవీణ్‌తో పెళ్లికి ఒప్పుకొంది. ఆమెను బాపట్లలో ఉంటున్న తన బంధువులకు తన కాబోయే భార్య అని చెప్పాడు. కానీ అతని తల్లిదండ్రులు వీరి పెళ్లికి నిరాకరించారు. అయితే నవంబరు 13న ప్యారడైజ్‌లో పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. ప్రవీణ్‌ చెప్పిన రోజు అక్కడి వెళ్లగా.. ప్రవీణ్‌ ఎవరో తెలియదంటూ నిర్వాహకులు ఆమెకు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని