భారీ భూకంపం..29కి చేరిన మృతులు

టర్కీలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 29 మంది మృతి చెందారు. మరో 22 మంది గల్లంతైనట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించారు. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. దేశ రాజధాని అంకారాకు 750 కి.మీ దూరంలో ఉన్న

Updated : 26 Jan 2020 04:31 IST

అంకారా(టర్కీ)‌: టర్కీలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 29 మంది మృతి చెందారు. మరో 22 మంది గల్లంతైనట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించారు. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. దేశ రాజధాని అంకారాకు 750 కి.మీ దూరంలో ఉన్న ఎలాజిగ్‌ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8:55గంటలకు భూమి కంపించింది. తర్వాత కూడా మరో 60 సార్లు స్వల్ప స్థాయి భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో దాదాపు 550 మంది గాయాలపాలయ్యారు. టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ అథారిటీ సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం శ్రమిస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి ఆస్పత్రికి తరలిస్తోంది.  

ప్రకంపనల ధాటికి ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లు వదిలి వీధుల్లోకి పరుగులు పెట్టారు. దీంతో అధికారులు వారిని స్థానికంగా ఉన్న విద్యార్థుల వసతి గృహాలు, పునరావాస శిబిరాలు, పాఠశాలలు, అతిథి గృహాలకు తరలించారు. భూకంప తీవ్రత భారీగా ఉండడంతో భవనాలు, నివాసాలు భారీ ఎత్తున ధ్వంసమయ్యాయి. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పొరుగు దేశాలలైన సిరియా, లెబనాన్‌లోనూ ప్రకంపన తీవ్రత ఉన్నట్లు తెలుస్తోంది. 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని