తల్లిని చంపి ప్రియుడితో అండమాన్‌కు..!

బెంగళూరు: కన్నతల్లినే అత్యంత దారుణంగా హత్యచేసి ప్రియుడితో పరారైన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. అంతేకాదు ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రియుడితో కలిసి అండమాన్‌కి పరారయ్యింది. కూతురే కన్న తల్లిని చంపడం అరుదైన ఘటన అని..మేం కూడా జీర్ణించుకోలేకపోతున్నామని బెంగళూరు పోలీసులు పేర్కొన్నారు

Updated : 06 Feb 2020 15:02 IST

బెంగళూరులో మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఘాతుకం


బెంగళూరు: కన్నతల్లినే అత్యంత దారుణంగా హత్యచేసి ప్రియుడితో పరారైన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. అంతేకాదు ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రియుడితో కలిసి అండమాన్‌కు పరారైంది. పక్కా పథకం ప్రకారమే అమృత ఈ హత్య చేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మూడు రోజుల పాటు గాలించిన అనంతరం పోలీసులు అమృతతో పాటు ప్రియుడు శ్రీధర్‌ రావుని అండమాన్‌లో అరెస్ట్‌ చేశారు. 

పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన అమృత(33) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తోంది. 2017 వరకు రెగ్యులర్‌గా పనిచేసిన అమృత, కుటుంబ సమస్యలతో ప్రస్తుతం ఇంటి దగ్గర నుంచే తాత్కాలికంగా పనిచేస్తోంది. అయితే పోలీసులు విచారణలో మాత్రం అమృత తన కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా అప్పుల్లో కూరుకుపోయిందని తెలిపిందన్నారు. 
 

తండ్రి ఊపిరితిత్తుల కాన్సర్ కారణంగా అమృత కుటుంబం అప్పల్లో కూరుకుపోయింది. వీటన్నింటినుంచి బయటపడేందుకు తన తల్లి, సోదరుడిని హత్య చేసి చివరకు తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని ఆమె భావించింది. ఫిబ్రవరి 2వ తేదీ తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో అమృత తన తల్లి నిర్మల(52)ను వంటిట్లో ఉన్న చాకుతో దారుణంగా పొడిచింది. ఆ సమయంలో అలజడికి నిద్రలేచి వచ్చిన సోదరుడిని కూడా అదే కత్తితో పొడిచింది. అనంతరం తల్లీ, సోదరుడు చనిపోయారని భావించి తన బ్యాగుతో బయటకు వెళ్ళింది. అప్పటికే ఇంటి బయట బైక్‌పై సిద్ధంగా ఉన్న ప్రియుడు శ్రీధర్‌రావుతో కలిసి నేరుగా ఎయిర్‌పోర్టుకు చేరుకొంది. ఆ బైక్‌ను అక్కడే వదిలేసి..ముందుగానే బుక్‌ చేసుకున్న విమానంలో పోర్ట్‌బ్లెయిర్‌కు పారిపోయారు. అక్కడే ఐదు రోజులపాటు గడిపేవిధంగా వీరు ప్లాన్‌ చేసుకున్నారు. అయితే, ఈ దాడిలో అమృత తల్లి అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన ఆమె సోదరుడు సమీపంలో ఉండే తమ బంధువులకు ఫోన్‌ చేసి ప్రాణాలు దక్కించుకొన్నాడు.

తన ప్రియుడికి ముందుగానే ఇచ్చిన మాట ప్రకారం అండమాన్‌కు వెళ్ళానని అమృత పోలీసులకు చెప్పడం గమనార్హం. అయితే అమృత హత్య ప్లాన్‌ తన ప్రియుడికి తెలుసా? లేదా? అనే విషయం ఇంకా తేలలేదని పోలీసులు పేర్కొన్నారు. పోలీసు విచారణలో అమృత చెప్పిన విషయాలు ఇలా ఉండగా.. ఇవే కచ్చితమైన కారణాలు కాకపోవచ్చని..మానసిక కారణాలు ఏవైనా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరిని బెంగళూరుకు తీసుకొచ్చిన విచారించిన అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని