పండగ రోజున విషాదం.. 14మంది మృతి

శివరాత్రి పర్వదినం రోజున దేశంలోని పలుచోట్ల రహదారులు నెత్తురోడాయి. శుక్రవారం రోజున వేర్వేరు చోట్ల జరిగిన రహదారి ప్రమాదాల్లో 14 మంది దుర్మరణం చెందారు. పలువురికి  గాయాలయ్యాయి. ........

Published : 22 Feb 2020 00:20 IST

దేశంలో వేర్వేరు చోట్ల నెత్తురోడిన రహదారులు

జైపూర్‌/కోల్‌కతా/ముంబయి: శివరాత్రి పర్వదినం రోజున దేశంలోని పలుచోట్ల రహదారులు నెత్తురోడాయి. శుక్రవారం వేర్వేరు చోట్ల జరిగిన రహదారి ప్రమాదాల్లో 14 మంది దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి. దీంతో ఆ కుటుంబాల్లో మహా శివరాత్రి రోజున విషాదం అలముకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో కారు ఓ ట్రక్కును ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హనుమాన్‌గఢ్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో 12 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరోవైపు, పశ్చిమబెంగాల్‌లో డంపర్‌ ట్రక్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కోల్‌కతాలోని అలిపురదౌర్‌ జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడనీ.. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే, మహారాష్ట్రలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పది మందికి గాయాలయ్యాయి. షోలాపూర్‌లోని వైరాగ్‌ ప్రాంతంలో ఆర్టీసీ బస్సును జీపు ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని