లాక్‌డౌన్‌లోనూ ఆగని అక్రమ రవాణా

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా పలు రకాల వ్యాపార కార్యకలాపాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే మత్తు పదార్థాలు, నకిలీ నోట్ల అక్రమ రవాణా మాత్రం భారత్‌-పాకిస్థాన్‌, భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతాల...... 

Updated : 16 Apr 2020 01:24 IST

దిల్లీ: కరోనా వైరస్‌ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా పలు రకాల వ్యాపార కార్యకలాపాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే మత్తు పదార్థాలు, నకిలీ నోట్ల అక్రమ రవాణా మాత్రం భారత్‌-పాకిస్థాన్‌, భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతాల వెంబడి యథేచ్చగా సాగినట్లు నివేదికలు వెల్లడించాయి.

పాక్‌, బంగ్లా  దేశాలతో భారత్‌ సరిహద్దు భద్రతను బీఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం) పర్యవేక్షిస్తుంటుంది. జనవరి 1 నుంచి ఏప్రిల్ 12 మధ్య కాలంలో ఈ రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ రవాణా ఘటనలు ఎక్కువ కావడంతో బీఎస్‌ఎఫ్‌ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. దీంతో ఇటువంటి ఘటనలు కొంత మేర తగ్గుముఖం పట్టినట్లు బీఎస్‌ఎఫ్ తెలిపింది.  

తరచుగా హెరాయిన్‌ వంటి మత్తు పదార్థాలు పాకిస్థాన్ నుంచి పంజాబ్ సరిహద్దులు గుండా భారత్‌లోకి అక్రమంగా తీసుకొస్తుంటారు. అయితే దేశం మొత్తం లాక్‌డౌన్‌ విధించినప్పటికీ వీటి అక్రమ రవాణా కొనసాగినట్లు సమాచారం. తరచుగా తీసుకెళ్లే (97 కిలోలు) దానికంటే తక్కువ మొత్తంలో (18 కిలోలు) హెరాయిన్‌ను అక్రమ రవాణా చేసినట్లు సమాచారం. బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో 328 పశువుల అక్రమ రవాణాను బీఎస్‌ఎఫ్ అడ్డుకోగా, సాధారణ రోజుల్లో వీటి సంఖ్య 20వేల వరకు ఉంటుందని నివేదికల్లో పేర్కొన్నారు. 

‘‘సరిహద్దుల వెంబడి జరిగే నేరాల గురించి అప్రమత్తంగా ఉండాలని బీఎస్‌ఎఫ్‌కు ఆదేశాలు జారీచేశాం. లాక్‌డౌన్ కారణంగా నేరాల సంఖ్య తగ్గినప్పటికీ, భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో ప్రతి రోజూ అటువంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. రెండు దేశాల సరిహద్దు భద్రత విషయంలో బీఎస్‌ఎఫ్‌ మరింత అప్రమత్తంగా ఉంటుంది’’ అని దిల్లీలోని బీఎస్‌ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. సాధారణ రోజులతో పోలిస్తే లాక్‌డౌన్‌లో ఫెన్స్‌డేల్, యాబా ట్యాబ్లెట్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణా మూడు రెట్లు తగ్గినట్లు బీఎస్ఎఫ్‌ తెలిపింది. అంతే కాకుండా నకిలీ భారత కరెన్సీ నోట్లు (ఎఫ్ఐసీఎన్‌) అక్రమ రవాణా కూడా మూడు రెట్లు తగ్గినట్లు తెలిపారు. బంగారం, వెండి ఆభరణాల అక్రమ రవాణా పూర్తిస్థాయిలో ఆగిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని