స్టైరీన్‌ లీకేజీ.. విశాఖలో మహా విషాదం

విశాఖ నగరంలో మహా విషాదం.. ఆర్‌.ఆర్‌ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి తెల్లవారు జామున 3 గంటల సమయంలో స్టైరీన్‌ విషవాయువు లీకైంది. కరోనా వైరస్‌ విజృంభణతో.....

Published : 08 May 2020 02:13 IST

ఇప్పటివరకు 11 మంది మృతి: ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ ప్రకటన
బాధితులకు అండగా సింహాచలం దేవస్థానం
బాధితులకు సీఎం జగన్‌ పరామర్శ
విశాఖలో పరిస్థితిపై గ్రౌండ్‌ రిపోర్ట్‌

విశాఖపట్నం: విశాఖ నగరంలో మహా విషాదం.. ఆర్‌.ఆర్‌ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి తెల్లవారు జామున 3 గంటల సమయంలో స్టైరీన్‌ విషవాయువు లీకైంది. కరోనా వైరస్‌ విజృంభణతో ఇప్పటికే బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న విశాఖ వాసులపైకి ఈ విషవాయువు మృత్యు రూపంలో దూసుకొచ్చింది. అందరూ గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా ఉపద్రం ముంచుకొచ్చింది. నిద్రలేచే లోపే ఎవరు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియని హృదయవిదారక పరిస్థితి. ఆ వాయువు పీల్చిన జనం రోడ్లపైకి వచ్చి ఉక్కిరిబిక్కిరై స్పృహ తప్పి పడిపోయిన దృశ్యాలు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఇప్పటి వరకు 11 మంది మృత్యువాతపడగా.. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ అధికారికంగా ప్రకటించారు. విశాఖలోని కేజీహెచ్‌, ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులే అధికంగా ఉన్నారు. మరోవైపు, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి విశాఖ చేరుకుని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు.

విషయం వెలుగులోకి ఇలా..
అర్ధరాత్రి 2 గంటల నుంచి 2.30గంటల సమయంలో సాంకేతిక లోపంతో ట్యాంకు నుంచి ఆవిరి, పొగ రూపంలో ఈ విష వాయువు కమ్ముకొచ్చింది. ఈ క్రమంలో కంపెనీలోని స్మోక్‌ డిటెక్టర్లు నుంచి వచ్చిన సంకేతంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. గ్యాస్‌ను నియంత్రించేందుకు వెళ్లారు. అప్పటికే దట్టంగా పొగలు కమ్ముకోవడంతో వారు ముందుకు వెళ్లలేకపోయారు. దీంతో 101కి ఫోన్‌ చేసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. గ్యాస్‌ లీకేజీని నియంత్రించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

అధిక ప్రభావం ఈ గ్రామాల్లోనే..

ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి లీకైన స్టైరీన్‌  విషవాయువు ప్రభావం ఐదు గ్రామాలపై అధికంగా ఉంది.  గోపాలపట్నం సమీపంలోని  వెంకటాపురం, పద్మనాభనగర్‌, కంపరపాలెం, కొత్తపాలెం, వెంకటాద్రి నగర్‌లలో మొత్తం 10 వేల కుటుంబాలు ఉంటాయి. వీరిలో దాదాపు 2వేల మందికి పైగా ఇళ్లల్లోనే ఉండిపోవడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ దళాలు రంగంలోకి దిగి వారిని కాపాడేందుకు ప్రయత్నించాయి. ఉదయం 5గంటల నుంచి ఇళ్లల్లో అచేతనంగా పడి ఉన్నవారిని తలుపులు బద్దలుకొట్టి మరీ బయటకు తీసుకొచ్చి ఆస్పత్రులకు తరలించారు. అంబులెన్స్‌లతో పాటు కార్లు, బైక్‌లపై క్షతగాత్రులను ఇతర ప్రాంతాలకు చేరవేశారు.

మృతుల వివరాలివే. 

వేపగుంటలో ఎల్జీ పాలిమర్స్‌ నుంచి లీకైన స్టైరీన్‌ మృత్యు ఘంట మోగించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 11మంది ప్రాణాలు కోల్పోయారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. కుందన్‌ శ్రేయ (6); ఎన్‌. గ్రీష్మ (9), చంద్రమౌళి (19); గంగాధర్‌; నారాయణమ్మ (35); అప్పలనరసమ్మ (45);గంగరాజు (48); మేకా కృష్ణమూర్తి (73); రత్నాల గంగాధర్‌ (64), మరో ఇద్దరు

తమ వారెక్కడ ఉన్నారో దిక్కుతోచక..

గ్యాస్‌ లీకైన ఘటనతో ముందే అప్రమత్తమైన పలు గ్రామాలకు చెందిన వారు నగరంలోని వేపగుంట, పెందుర్తి తదితర ప్రాంతాల వైపు పరుగులు పెట్టారు. అక్కడే రోడ్లపై సేదతీరుతున్నారు. తమ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో విలపిస్తూ నరకయాతన పడుతున్నారు.

నిర్జీవంగా మూగజీవాలు.. రంగుమారిన చెట్లు

గ్యాస్‌ ప్రభావంతో ఆయా గ్రామాల్లోని మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. రహదారులపై పశువులతో పాటు పక్షులు, కోళ్లు ఎక్కడికక్కడ నిర్జీవంగా పడి ఉండటంతో విషాద ఛాయలు అలముకున్నాయి. స్టైరీన్‌ తీవ్రతకు చెట్లు సైతం నలుపు, ఎరుపు రంగుల్లోకి మారిపోయి కనిపించాయి. అలాగే, పాములు కూడా బయటకు వచ్చి నిర్జీవంగా పడి ఉన్నాయి.

కంపెనీ ప్రతినిధులేమన్నారు?
ఈ ఘటనపై కంపెనీ ప్రతినిధులు స్పందించారు. లాక్‌డౌన్‌తో 45 రోజుల పాటు మూసి ఉన్నకారణంగా గ్యాస్‌ ఎక్కువగా నిల్వ ఉందని తెలిపారు. గ్యాస్‌ ట్యాంక్‌ పరిస్థితిపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నా.. దురదృష్టవశాత్తు విషాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ మినహాయింపు నేపథ్యంలో పరిమిత సంఖ్యలో సిబ్బందితో ఈ పరిశ్రమ నడుస్తోంది. నిన్న రాత్రి షిప్ట్‌లో 15మంది ఉన్నారు. అందులో ఉన్నవారెవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. వారంతా సురక్షితంగానే ఉన్నట్టు సమాచారం. 

పరిస్థితి అదుపులోనే ఉంది: సీపీ ఆర్కే మీనా

ఈ ఘటన జరిగిన తర్వాత సహాయక సిబ్బంది, రక్షణ దళాలు ముందుగా ఇళ్లల్లో ఉన్నవారందరినీ ఖాళీ చేశారని సీపీ ఆర్కే మీనా వెల్లడించారు. ఇళ్లల్లో చిక్కుకుపోయిన సురక్షిత ప్రాంతాలకు వారిని తరలిస్తున్నామన్నారు. దీని తీవ్రతకు ఎంతమంది ప్రభావితమయ్యారనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. పరిస్థితి మాత్రం అదుపులోనే ఉందన్నారు.

బాధితులకు అండగా సింహాచలం దేవస్థానం..

గ్యాస్ లీకైన ఘటనలో బాధితులకు సింహాచలం దేవస్థానం అండగా నిలబడింది. ఆయా ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వందలాది మంది బాధితులకు ఈవో వెంకటేశ్వరరావు స్వయంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. వసతితో పాటు అల్పాహారం అందించారు. మధ్యాహ్నం వీరందరికీ భోజనం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధితులు సురక్షితంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లాలని ఆయన సూచించారు. సింహాచలం వచ్చేవారికి దేవస్థానం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని