స్పైస్‌జెట్‌ పైలట్‌పై తుపాకీ గురి పెట్టి..

దేశరాజధాని దిల్లీలో ఓ స్పైస్‌ జెట్‌ ఉద్యోగికి భయానక అనుభవం ఎదురైంది. కొందరు దుండగులు సదరు ఉద్యోగిని తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున దక్షిణ దిల్లీలో చోటు చేసుకుంది...

Published : 04 Jun 2020 11:29 IST

దిల్లీ: దేశరాజధాని దిల్లీలో ఓ స్పైస్‌ జెట్‌ ఉద్యోగికి భయానక అనుభవం ఎదురైంది. కొందరు దుండగులు సదరు ఉద్యోగిని తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున దక్షిణ దిల్లీలో చోటు చేసుకుంది. ఫరీదాబాద్‌కు చెందిన యువరాజ్‌ తెవాటియా స్పైస్‌జెట్‌లో పైలట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో విధులకు హాజరయ్యేందుకు తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో తన నివాసం నుంచి విమానాశ్రయానికి కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో ఐఐటీ సమీపంలోని ఫ్లైవోవర్‌ వద్దకు రాగానే ఐదు ద్విచక్రవాహనాలపై వచ్చిన సుమారు పదిమంది దుండగులు యువరాజ్‌ కారును అడ్డగించి దాడి చేశారు. కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. అనంతరం బాధితుడిని తుపాకీతో బెదిరించి దోచుకొన్నారు. అంతటితో ఆగకుండా ఓ దుండగుడు యువరాజ్‌పై కత్తితో దాడి చేశాడు. 

దీంతో తీవ్రంగా గాయపడిన యువరాజ్‌ దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అతికష్టం మీద పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించారు. దుండగులు తన వద్ద ఉన్న వస్తువులతోపాటు రూ.34వేల నగదును అపహరించినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠా కోసం గాలింపు చేపట్టారు. దక్షిణ దిల్లీలోని ఐఐటీ ఫ్లైవోవర్‌ వద్ద ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని