యూపీ కోటి జీతం అసలు దోషి పట్టివేత

ఒకే ఉపాధ్యాయురాలు రూ.కోటి వేతనం అందుకున్న సంచలనాత్మక కేసులో సూత్రధారిని ఉత్తర్‌ ప్రదేశ్‌ అధికారులు అరెస్టు చేశారు.

Published : 17 Jun 2020 01:14 IST

‘కోటి రూపాయల టీచర్‌’ సూత్రధారి ఇతనే...

లఖ్‌నవూ: ఒకే ఉపాధ్యాయురాలు రూ.కోటి వేతనం అందుకున్న సంచలనాత్మక కేసులో సూత్రధారిని ఉత్తర్‌ ప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి పుష్పేంద్ర అనే వ్యక్తినే కాకుండా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఆనంద్‌, రామ్‌నాథ్‌ అనే మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి ఓ పిస్తోలు, గుళ్లు, మొబైల్‌ ఫోన్లు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల విధుల్లో చేరని అనామికా శుక్లా అనే మహిళ పేరును, ధృవపత్రాలను ఉపయోగించుకుని పలువురు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా చలామణీ అయినట్టు పోలీసులు వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి...

రాష్ట్రంలోని పలు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కెజీబీవీ) అనామికా శుక్లా అనే ఓ ఉపాధ్యాయురాలు విధులు నిర్వహిస్తూ వేతనంగా రూ.కోటి అందుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దీనితో అధికారులు వెంటనే రంగంలోకి దిగి, సంఘటనపై విచారణ చేపట్టారు. గోండా గ్రామానికి చెందిన నిజమైన అనామికా శుక్లా, 2017లో కెజీబీవీ టీచర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసారు. అయితే నియామక పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ ఆరోగ్య కారణాల వల్ల ఆమె విధుల్లో చేరలేదు. దీన్ని పుష్పేంద్ర అవకాశంగా తీసుకున్నాడు. ఆనంద్‌ నుంచి అనామిక ధృవపత్రాల నకళ్లను సంపాదించాడు. ఒక్కో అభ్యర్థి వద్ద రూ.రెండు లక్షల చొప్పున వసూలు చేసి.. వారికి ఉద్యోగాలు వచ్చేలా చేశాడు.

ఈ విధంగా లఖ్‌నవూతో సహా ప్రయాగ్‌ రాజ్‌, అమేథీ, జౌన్‌పూర్‌, మిర్జాపూర్‌, బస్తీ తదితర గ్రామాల్లో నకిలీ టీచర్లు అనామికా శుక్లా అనే మారుపేరుతో విధుల్లో చేరారు. కాగా, జీతభత్యాల రూపంలో వీరు లక్షలాది రూపాయలు స్వాహా చేసినట్టు వెల్లడైంది. ఈ విషయం తెలిసిన అసలు అనామిక, జూన్ 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ ఉపాధ్యాయులను అరెస్టు చేయగా..  దీనికంతటికీ పుష్పేంద్ర సూత్రధారి అని వారు విచారణలో తెలిపారు. గాలింపు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు గోమతీ నగర్‌లో ఉన్న పుష్పేంద్రను సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని