స్నేహితుడి చేతిలో యువకుడి హతం

వారిద్దరూ స్నేహితులు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఇంట్లో సంతోషంగా విందు చేసుకున్నారు. అయితే ఒక్కసారిగా ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. అంతే ...

Published : 18 Jun 2020 01:09 IST

మద్యం మత్తులో ఘాతుకం

రామగుండం : వారిద్దరూ స్నేహితులు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఇంట్లో సంతోషంగా విందు చేసుకున్నారు. అయితే ఒక్కసారిగా ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. అంతే మద్యం మత్తులో ఓ యువకుడు స్నేహితుడి తలపై రోకలితో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అంతర్గాం మండలం గోయల్‌వాడలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గోయల్‌వాడకు చెందిన మామిడాల అనిల్‌, నేరెళ్ల చందు(27) స్నేహితులు. అవివాహితులైన ఇద్దరూ వారి కుల వృత్తి పనులు చేస్తూ కుటుంబాలకు చేదోడుగా ఉన్నారు. మంగళవారం అనిల్‌ ఇంట్లో అతడితో పాటు చందు, అనిల్‌ తండ్రి శంకరయ్య విందు చేసుకున్నారు. మద్యం తాగుతుండగా అనిల్‌, చందుల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. వారిని ఆపేందుకు శంకరయ్య ప్రయత్నించగా వారు అతడిని బయటకు పంపారు. కొద్దిసేపటికి శంకరయ్య ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తం మడుగులో చందు విగత జీవిగా కనిపించాడు. మంచం పక్కనే రోకలి ఉంది. అనిల్‌, చందు మధ్య ఏ విషయమై గొడవ జరిగిందనేది తెలియాల్సి ఉంది. రామగుండం సి.ఐ. టి.కరుణాకర్‌రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు అనిల్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుడు చందు తల్లి రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ టి.పురుషోత్తంరెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని