మద్యం తాగి వాహనం నడిపితే లైసెన్స్‌ రద్దు

చిత్తుగా మద్యం తాగి మత్తుగా కార్లు, బైకులు, ఆటోలు, బస్సులు, లారీలు నడుపుకుంటూ వెళ్తున్న మందుబాబులపై పోలీసులు గట్టిగా దృష్టిపెట్టారు..

Updated : 01 Jul 2021 09:26 IST

జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా అదనం

ఈనాడు, హైదరాబాద్‌: చిత్తుగా మద్యం తాగి మత్తుగా కార్లు, బైకులు, ఆటోలు, బస్సులు, లారీలు నడుపుకుంటూ వెళ్తున్న మందుబాబులపై పోలీసులు గట్టిగా దృష్టిపెట్టారు.. మోతాదుకు మించి మద్యం తాగి ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడితే ఇక రూ.10 వేలు జరిమానా విధిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేస్తుండడంతో వారంలో మూడు రోజులు డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించాలని పోలీస్‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది ప్రారంభంలో ట్రాఫిక్‌ పోలీసులు 2,500 మంది వాహనచోదకులపై కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్‌ పోలీసులు సమర్పించిన అభియోగపత్రాల ఆధారంగా ఒక్కొక్కరికీ రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టులు ఉత్తర్వులు జారీ చేశాయి. వీరిలో అత్యధికులకు ఆరు నెలల పాటు డ్రైవింగ్‌ లెసెన్స్‌ రద్దు చేయగా.. 210 మందికి జైలు శిక్ష విధించాయి.

సవరణ చట్టంతో..

రహదారులపై ప్రమాదాలను నియంత్రించేందుకు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల సవరణ చట్టం-2019ను 2019 సెప్టెంబరు నుంచి అమల్లోకి తెచ్చింది. కేంద్ర మోటార్‌ వాహనాల సవరణ చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా కోర్టులు ఆ చట్టంలోని అంశాల వారీగా జరిమానాలు విధిస్తున్నాయి. అందుకే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదుచేస్తున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరు పరిచినప్పుడు కోర్టులు మందుబాబులకు రూ.10వేలు జరిమానా విధిస్తున్నాయి. పోలీసుల నివేదిక ఆధారంగా జైలు శిక్షలు, లైసెన్సు రద్దులపై కోర్టులు ఉత్తర్వులు జారీచేస్తున్నాయి.

ఆకస్మికంగా తనిఖీలు

లాక్‌డౌన్‌ తొలగించిన రోజు నుంచీ పోలీసులు మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై దృష్టి కేంద్రీకరించారు. రాత్రివేళల్లో తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. నాలుగైదు రోజులుగా హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో పబ్బులు, బార్లు, రిసార్ట్‌లు పరిసర ప్రాంతాల్లో పార్టీలు జరుగుతుండడం, అర్ధరాత్రి దాటాక కార్లు, జీపుల్లో మందుబాబులు వెళ్తున్నట్టు గుర్తించారు. దీంతో ఎంపిక చేసిన ప్రాంతాల వద్ద కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించనున్నారు.

భవిష్యత్తులో అన్నీ కష్టాలే...:

మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడితే భవిష్యత్తులో కష్టాలను ఆహ్వానించినట్టే. కోర్టుల్లో పోలీసులు సమర్పిస్తున్న అభియోగ పత్రాల ఆధారంగా ప్రతి కేసూ కోర్టులో నమోదవుతుంది. జైలుకు వెళ్తే ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలున్నాయి. ఇంతేకాదు.. విదేశాలకు వెళ్లేందుకు వీలుండదు. డ్రంకెన్‌డ్రైవ్‌లో తొలిసారి పట్టుబడితే లైసెన్స్‌ తాత్కాలికంగా రద్దవుతుంది. తీవ్రత ఆధారంగా శాశ్వతంగా కూడా రద్దు చేయవచ్ఛు

- ఎస్‌.అనిల్‌కుమార్‌, అదనపు సీపీ(ట్రాఫిక్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని