ఫోన్‌ మాట్లాడుతుందని పొట్టన పెట్టుకున్నారయ్యా..!

తమ కుమార్తె తల్లిదండ్రులతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుందని అత్తింటివారు ఆమెను పొట్టనపెట్టుకున్నారంటూ ఆరోపిస్తూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 03 Aug 2021 08:26 IST

హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు

గుంటూరు అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు


వెంకటేశ్వర్లు దంపతుల సమస్యను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : తమ కుమార్తె తల్లిదండ్రులతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుందని అత్తింటివారు ఆమెను పొట్టనపెట్టుకున్నారంటూ ఆరోపిస్తూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని.. తమకు న్యాయం చేయాలని సోమవారం పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల గుండెకోతను అర్ధం చేసుకోవాలని సత్యవాణి, రాజగోపాల్‌ దంపతులు వేడుకున్నారు. స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు. అనంతరం బాధితులు విలేఖరులతో మాట్లాడారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..‘మేము పాత గుంటూరులో ఉంటున్నాం. మాకు ఆడపిల్ల లేకపోవడంతో మా సోదరికి కవల పిల్లలు పుడితే సాయి ప్రవళ్లిక (24)ను చిన్నతనంలో దత్తతతీసుకొని పెంచిపెద్ద చేశాం. బీకాం చదివించి మూడేళ్ల కిందట ఓ కళాశాలలోని అధ్యాపకునితో వివాహం చేశాం. వారికి ఒక పాప. ఈ క్రమంలో జూన్‌ 21న మా పాప చనిపోయిందని సమాచారం వచ్చింది. గుంటూరులోని ఆమె ఇంటికి వెళ్లి చూస్తే శరీరం సగం కాలిపోయి విగతజీవిగా పడి ఉంది. అది చూసిన తమకు గుండె ఆగినంతపనైంది. అదేమని అడిగితే ఆత్మహత్య చేసుకుందంటున్నారు. శానిటైజర్‌, నువ్వుల నూనెతో తగలబెట్టి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను హత్య చేసి పైగా ఆమె పిచ్చిదని నమ్మించి నేరస్థులు తప్పించుకోవాలని చూస్తున్నారు. శవ పరీక్ష నివేదిక వస్తే హత్యా, ఆత్మహత్యా అనేది స్పష్టత వస్తుందని పోలీసులు అంటున్నారు. ఘటన జరిగి 40 రోజులు గడుస్తున్నా ఇంతవరకు నివేదిక రాలేదంటున్నారు. తమ కూతురు మృతి మిష్టరీ ఛేదించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరుతున్నా’మని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని