Fake Customer cares: 189 కేసులు.. రూ.1.01 కోట్లు

వినియోగదారుల సహాయ కేంద్రం(కస్టమర్‌ కేర్‌) నంబర్‌ కోసం గూగుల్‌లో వెతుకుతున్నారా..? అయితే.. మీరు అప్రమత్తం కావాల్సిందే. లేదంటే సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కడం ఖాయమని సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ...

Updated : 04 Aug 2021 08:55 IST

గూగుల్‌లో నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్లు
ఈ ఏడాది సైబర్‌ మోసాల్లో ఇవే ఎక్కువ

ఈనాడు, హైదరాబాద్‌: వినియోగదారుల సహాయ కేంద్రం(కస్టమర్‌ కేర్‌) నంబర్‌ కోసం గూగుల్‌లో వెతుకుతున్నారా..? అయితే.. మీరు అప్రమత్తం కావాల్సిందే. లేదంటే సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కడం ఖాయమని సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సైబరాబాద్‌ పరిధిలో నమోదైన 1395 కేసుల్లో ఈ తరహా మోసాలే మొదటి స్థానంలో ఉన్నాయి. 189 కేసుల్లో బాధితులు రూ.1.01 కోట్లు మోసపోయారు.

అవసరమై కాల్‌ చేస్తూ...
ఏదైనా సమస్య వస్తే మనలో చాలామంది వెంటనే గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ వెతుకుతారు. అక్కడ కనిపించేది అసలుదా? నకిలీదా? అని నిర్ధారించుకోకుండానే ఆత్రుతలో కాల్‌ చేస్తుంటారు. ఇదే సైబర్‌ నేరగాళ్లకు వరంగా మారింది. బ్యాంకులు, టెలికాం సంస్థలు, ఫుడ్‌ డెలివరీ యాప్‌లు, ట్రావెల్స్‌, కొరియర్‌, యూపీఐ యాప్‌ల (గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం తదితర)కు సంబంధించి నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్లను గూగుల్‌లో కొందరు మోసగాళ్లు అప్‌డేట్‌ చేస్తున్నారు. అవసరమైతే గూగుల్‌ యాడ్స్‌ కొనుగోలు చేసి.. ఈ వివరాలను పోస్ట్‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

లింక్‌ పంపించి.. ఓటీపీ తీసుకుని..
సైబర్‌ నేరగాళ్లు అన్నింటికి కలిపి ఒక్కటే నకిలీ నంబర్‌ను గూగుల్‌లో పోస్ట్‌ చేస్తారు. ఉదాహరణకు.. బ్యాంకు కస్టమర్‌ కేర్‌ సెంటర్‌,   కొరియర్‌ సర్వీస్‌కు అదే నంబర్‌ ఉంటుందన్న మాట. చాలా తెలివిగా బుట్టలోకి దింపి.. ఎందుకు కాల్‌ చేశారో
ఆరా తీస్తారు. రెండు నిమిషాల్లో సమస్యను పరిష్కరిస్తామంటూ భరోసానిస్తారు. లింక్‌ను(గూగుల్‌ ఫాం) పంపిస్తారు. దాన్ని ఓపెన్‌ చేసి.. అందులో వివరాలను నమోదు చేయాలని సూచిస్తారు. ఇలా ఏటీఎం/క్రెడిట్‌ కార్డు నంబర్‌, సీవీవీ, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుంటారు. ఆ తర్వాత మీకొచ్చిన ఓటీపీ చెబితే ఫిర్యాదును రిజిస్టర్‌ చేస్తామని చెప్ఫి. అలా ఓటీపీని తీసుకుని ఆన్‌లైన్‌లో షాపింగ్‌/లావాదేవీ చేస్తారు. బ్యాంక్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌ వచ్చే వరకు మనం మోసపోయినట్లు తెలియదు.

జాంతారా.. దేవ్‌ఘడ్‌.. గిరిడి... : ఈ తరహా మోసాలు చేయడంలో జాంతారా(జార్ఖండ్‌) ముఠా ఆరితేరారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న మోసాల్లో 50 శాతం ఈ ముఠానే చేస్తున్నట్లు పోలీసులు వివరిస్తున్నారు. జార్ఖండ్‌కు సమీపంలోని దేవ్‌ఘడ్‌, గిరిడి జిల్లాలకు చెందిన ముఠాలు ఇదే పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ముఠాలను పట్టుకోవడం పోలీసులకు కత్తిమీద సామే అని చెప్పొచ్ఛు ఊర్లోకి పోలీసులు అడుగు పెట్టగానే సమాచారం తెలిసేలా ప్రత్యేక వేగులుంటారు. నిమిషంలో అక్కడి నుంచి మాయమైపోతారు. ఒకవేళ పోలీసులకు చిక్కినా డబ్బు రికవరీ కాదు. మోసం చేసినప్పుడే ఖర్చు చేసేస్తారు. విలాసవంతంగా బతికేందుకు వెచ్చిస్తుంటారని అక్కడికెళ్లిన దర్యాప్తు అధికారులు వివరిస్తున్నారు.


వెబ్‌సైట్‌, యాప్‌ నుంచే.. : కస్టమర్‌ కేర్‌ నంబర్‌ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రతి సంస్థకు అధీకృత వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ఉంటుంది. అక్కడి నుంచే తీసుకోవాలి. సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతే జాప్యం చేయకుండా దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.

- బాలకృష్ణారెడ్డి, సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని