AP News: పెళ్లి చేసుకుంటానని చెప్పి.. యువతిపై పెట్రోల్‌ పోసి..

పూసపాటిరేగ మండలం చౌడువాడలో దారుణం చోటుచేసుకుంది.

Updated : 20 Aug 2021 16:05 IST

పూసపాటిరేగలో దారుణం

విజయనగరం : పూసపాటిరేగ మండలం చౌడువాడలో దారుణం చోటుచేసుకుంది. ఓ కిరాతకుడు యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన యువతి అక్క, అమె కుమారుడికి కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు బాధితులను విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని నరవకు చెందిన రాంబాబుగా గుర్తించారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. రాంబాబు, ఆ యువతి గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు కూడా వీరి పెళ్లికి అంగీకరించాయి. అయితే ఇటీవల ఆ యువతి వేరే యువకుడితో మాట్లాడుతోందంటూ రాంబాబు పెళ్లి రద్దు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి రెండు కుటుంబాలను పిలిచి పోలీసులు రాజీ కుదిర్చారు. పోలీసుల సూచనతో వివాహం చేసుకునేందుకు యువకుడు అంగీకరించాడు. ఆ తర్వాత నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాధితురాలిని పరామర్శించిన మంత్రులు, ఉన్నతాధికారులు

చౌడువాడ బాధితురాలిని కలెక్టర్ సూర్యకుమారి, ఎస్పీ దీపికా పాటిల్‌ పరామర్శించారు. హత్యాయత్నం చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారం రోజుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేస్తామన్నారు. బాధితురాలికి ఎలాంటి ప్రాణాపాయం లేదని ఎస్పీ దీపికా పాటిల్‌ వెల్లడించారు. మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మరోవైపు మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ బాధితురాలిని పరామర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని