Crime News: ప్రాణం పోసినోడే.. ఆయువు తీశాడు

రెండేళ్ల కుమారుడిని అతి కిరాతంగా హత్య చేశాడో తండ్రి. ఈ ఘటన లంగర్‌హౌస్‌ ఠాణా పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. లంగర్‌హౌస్‌,

Updated : 18 Sep 2021 09:33 IST

రెండేళ్ల తనయుణ్ని గొంతుకోసి చంపిన తండ్రి

  ఇస్మాయిల్‌                        హసీబ్‌

మెహిదీపట్నం, న్యూస్‌టుడే: రెండేళ్ల కుమారుడిని అతి కిరాతంగా హత్య చేశాడో తండ్రి. ఈ ఘటన లంగర్‌హౌస్‌ ఠాణా పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. లంగర్‌హౌస్‌, ప్రశాంత్‌నగర్‌(కొసరాజు ఆసుపత్రి వీధిలో)కు చెందిన హసీబ్‌(38)కు, మొఘల్‌కానా ప్రాంతానికి చెందిన హస్రత్‌ బేగం(30)కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇస్మాయిల్‌(2), రెహాన్‌(8 నెలలు) సంతానం. మూడేళ్ల క్రితం వరకు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసిన హసీబ్‌ అప్పుడప్పుడు వింతగా ప్రవరిస్తుంటాడు. సంస్థ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. ఇంట్లోనే ఉంటూ తరచూ పెద్దగా అరుస్తూ హంగామా చేస్తుంటాడు. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పెద్ద కుమారుడు ఇస్మాయిల్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆడుకుంటున్నాడు. మొదటి అంతస్తు నుంచి కిందికి వచ్చిన తండ్రి.. కుమారుణ్ని మొదటి అంతస్తులోని గదిలోకి తీసుకెళ్లి కత్తితో గొంతు కోశాడు. గదిలోనే పడేసి కిందికి దిగి పారిపోయాడు. హసీబ్‌ చేతులకు రక్తం ఉండడం గమనించిన అతని తల్లి ఖుస్రూబేగం, భార్య హస్రత్‌బేగం పరుగెత్తుకుంటూ మొదటి అంతస్తులోకి వెళ్లారు. రక్తపు మడుగులో ఉన్న ఇస్మాయిల్‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హసీబ్‌ కొద్దికాలంగా మానసిక స్థితి సరిగా లేక మందులు వాడుతున్నట్లు తెలిసింది. హత్య అనంతరం నిందితుడు లంగర్‌హౌస్‌ చౌరస్తా, ఫ్లోర్‌మిల్‌ మీదుగా వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ శివమారుతి ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి హసీబ్‌ కోసం గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని