Telugu Akademi Scam: నిందితులు కొనుగోలు చేసిన ఆస్తుల గుర్తింపు

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ వ్యవహారంలో షిర్డీకు చెందిన మదన్‌ను నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్‌ చేశారు. కేసులో నిందితురాలు, కెనరా బ్యాంకు...

Updated : 21 Dec 2022 16:22 IST

తెలుగు అకాడమీ ఎఫ్‌డీల గోల్‌మాల్‌ వ్యవహారంలో మరొకరి అరెస్ట్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ వ్యవహారంలో షిర్డీకు చెందిన మదన్‌ను నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్‌ చేశారు. కేసులో నిందితురాలు, కెనరా బ్యాంకు మాజీ మేనేజర్‌ సాధన భర్త బాబ్జీకు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. తాజాగా అరెస్టయిన మదన్‌.. కీలక నిందితుడు సాయికుమార్‌కు ప్రాణస్నేహితుడు. ఇతడి ద్వారానే విశాఖపట్నానికి చెందిన సాంబశివరావుతో సంప్రదింపులు జరిపించారు. మధ్యవర్తిత్వం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. వీరు ఎప్పుడు షిర్డీ వెళ్లినా అక్కడ అవసరమైన సౌకర్యాలు కల్పించేవాడు. ముగ్గురూ కలిసి రూ.64.05 కోట్ల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కొట్టేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. గతేడాది డిసెంబరులోనే తెలుగు అకాడమీ సొమ్ము కాజేసేందుకు తెలివిగా వ్యూహరచన చేశారు. అనంతరం తమకు అనుకూలమైన వ్యక్తులను సహకారంతో వ్యవహారం నడిపించారు. కోట్లాది రూపాయలు చేతికి అందగానే వాటాలు పంచుకున్నారు. ఆనక భారీగా ఆస్తులు కూడబెట్టారు. కేసును సవాల్‌గా తీసుకున్న నగర సీసీఎస్‌ పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. రూ.64.05 కోట్లలో ఇప్పటివరకు రూ.20 కోట్లు స్వాధీనం చేసుకొని.. 17 మందిని అరెస్ట్‌ చేశారు. తెరవెనుక నుంచి నిందితులకు సహకరించిన కొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. సీసీఎస్‌ పోలీసులు మాత్రం కేసుతో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదలబోమని స్పష్టం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన మరికొందరిని అరెస్ట్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేసులో కీలకమైన ఆధారాలు రాబట్టేందుకు సాంబశివరావు కస్టడీకు కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్టు సమాచారం. 

రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ లేఖ.. 

అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌లో నగర సీసీఎస్‌ పోలీసులు రూ.20 కోట్లు తిరిగి రాబట్టారు. ఇందులో రూ.3 కోట్ల నగదు, రూ.16 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. ఈ ఆస్తిపాస్తుల క్రయవిక్రయాలు జరగకుండా ఏపీ, తెలంగాణ స్టాంపులు/రిజిస్ట్రేషన్‌ శాఖకు లేఖ రాయనున్నారు. 

గుర్తించిన ఆస్తులివే.. 

కేసులో కీలక సూత్రదారి సాయికుమార్‌ పెద్దఅంబర్‌పేట్‌(ఔటర్‌ రింగ్‌రోడ్డు) సమీపంలో రూ.100 కోట్ల విలువైన 30 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. ఇది వివాదంలో ఉన్నా ఈసీ ప్రతి చూపి సొంతం చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. 

* బ్యాంకు మాజీ మేనేజర్‌ మస్తాన్‌వలీ తన వాటాగా రూ.2.5 కోట్లు తీసుకున్నాడు. వీటితో నగరంలో ఖరీదైన ప్రాంతంలో ఒక ప్లాటు, యూసుఫ్‌గూడలో మరో ప్లాటును కొనుగోలు చేశాడు. 

* కెనరా బ్యాంకు మాజీ మేనేజర్‌ సాధన రూ.1.99 కోట్లు స్వాహా చేశారు. ఈ మొత్తంతో శంకరంపల్లి వద్ద రూ.1.20 కోట్ల విల్లా, విశాఖపట్నంలోని ఖరీదైన ప్రాంతంలో ఫ్లాటు కొనుగోలు చేశారు. 

* నండూరి వెంకటరమణ ఏపీలోని తణుకులో 41 సెంట్ల స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. విశాఖ, విజయనగరం జిల్లాల్లోనూ స్థలాలు కొనుగోలు చేశాడు. 

* వైజాగ్‌కు చెందిన సాంబశివరావు తన వాటాగా రూ.55 లక్షలు తీసుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని