
Crime News: కామాంధుల వికృత కేళి.. పది రోజుల్లో ముగ్గురిపై అఘాయిత్యం
అనంతరం ఒకరిని హత్యచేసిన నిందితుడు
మరో ఘటనలో పసికందుపై..
దేశంలో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గుజరాత్లోని గాంధీనగర్ జిల్లా కలోల్ మండలం వన్సజదా గ్రామానికి చెందిన విజయ్ ఠాకూర్(26).. పది రోజుల వ్యవధిలో ముగ్గురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వారిలో ఒకరిని చంపేశాడు కూడా. రోజు కూలీగా పనిచేసే అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. మొబైల్ ఫోన్లో అతిగా నీలి చిత్రాలు చూసేందుకు అలవాటుపడ్డ విజయ్.. నవంబరు 4న రంచర్దా గ్రామంలో ఐదేళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేశాడు. బాలికకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. అనంతరం నవంబరు అయిదో తేదీ రాత్రి మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన విజయ్.. ఆమె పెద్దగా కేకలు పెట్టటంతో చంపేశాడు. ఆ తర్వాత అత్యాచారం చేసి.. మృతదేహాన్ని స్థానికంగా ఉన్న కల్వర్టు దగ్గర పడేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. విజయ్ను అరెస్ట్ చేశారు. కొత్త వస్త్రాలు కొనిస్తానని మాయమాటలు చెప్పి పది రోజుల క్రితం ఏడేళ్ల బాలికపైనా విజయ్ అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
వలస కూలీల చిన్నారిపై..
గుజరాత్లోని సూరత్లో దారుణ ఘటన జరిగింది. రెండున్నరేళ్ల పసికందుపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బిహార్ నుంచి వచ్చిన వలసకూలీల కుటుంబానికి చెందిన ఆ పాప.. దీపావళి రాత్రి ఆడుకుంటూ అదృశ్యమైంది. రంగంలోకి దిగిన పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు.. ఆ కుటుంబం ఉంటున్న ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఓ కర్మాగారం వద్ద ఆదివారం శిశువు మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడు పసికందును లైంగికంగా వేధించాడని, ఆ తర్వాత గొంతు నులిమి చంపేసినట్లు శవ పరీక్షల్లో వెల్లడైంది. గుడ్డూ యాదవ్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.