Crime News: పంజాగుట్టలో చిన్నారి హత్య కేసు కొలిక్కి.. అమ్మే చంపేసిందా!

పంజాగుట్ట ఠాణా పరిధిలో నాలుగేళ్ల చిన్నారి హత్య కేసు చిక్కుముడి వీడింది. చిన్నారిని చంపింది ఇద్దరని పోలీసులకు కీలక ఆధారాలు...

Published : 13 Nov 2021 07:37 IST

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, పంజాగుట్ట: పంజాగుట్ట ఠాణా పరిధిలో నాలుగేళ్ల చిన్నారి హత్య కేసు చిక్కుముడి వీడింది. చిన్నారిని చంపింది ఇద్దరని పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌లో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు శనివారం వెల్లడించనున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. బాలిక తల్లే ఈ దారుణానికి ఒడిగట్టిందని తెలిసింది. వివాహేతర సంబంధం ఇందుకు కారణమని సమాచారం. ద్వారకాపురికాలనీలో ఒక దుకాణం ముందు ఎనిమిది రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో బాలిక మృతదేహం పోలీసులకు కనిపించింది. అప్పటి నుంచి పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి కొంత దూరంలో లభించిన కీలకాధారంతో నిందితులను గుర్తించారు. 

వివిధ రాష్ట్రాల్లో గాలింపు.. 

కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు లభించపోవడంతో ఒక ప్రకటన రూపొందించి తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, మహారాష్ట్రలకు పంపించారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లోనూ చిన్నారి చిత్రాన్ని పోస్ట్‌ చేశారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తుండగా బుధవారం రాత్రి కీలకాధారం లభించింది. నిందితులు అజ్‌మేర్‌లో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. వారు పాతబస్తీకి చెందిన వారిగా గుర్తించారు. బాలిక తండ్రి చనిపోవడంతో ఆమె.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని, వారు యాచకులని పోలీసులకు ఆధారాలు లభించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని