Crime News: తెదేపా దళిత కార్యకర్తపై దుండగుల దుశ్చర్య

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రుకు చెందిన దళిత యువకుడు, తెదేపా కార్యకర్త వెంకట నారాయణపై మద్యం మత్తులో కొందరు దుండగులు

Updated : 22 Dec 2021 09:49 IST

మద్యం మత్తులో దాడి చేసి హత్యకు యత్నం

బీరు సీసాలతో తల పగులగొట్టి నిప్పంటించి పరారు

గుంటూరు జిల్లా బోయపాలెంవద్ద ఘటన

ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, యడ్లపాడు: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రుకు చెందిన దళిత యువకుడు, తెదేపా కార్యకర్త వెంకట నారాయణపై మద్యం మత్తులో కొందరు దుండగులు దాడి చేసి హత్యకు యత్నించారు. బీరు సీసాలతో తల పగులగొట్టి నిప్పంటించి పరారయ్యారు. తీవ్ర గాయాలైన బాధితుడు ప్రస్తుతం గుంటూరు బోధనాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యడ్లపాడు, ప్రత్తిపాడు మండలాల సరిహద్దులో బోయపాలేనికి సమీపంలోని పొలాల్లో ఈ ఘటన సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరగగా.. మంగళవారం ఉదయం వెలుగు చూసింది. వంట మాస్టరుగా జీవనం సాగిస్తున్న వెంకట నారాయణ తన అత్తగారి ఊరైన పెదకూరపాడులో ఉంటున్నారు. కొప్పర్రులో ఉంటున్న తల్లిని చూడటానికి సోమవారం రాత్రి బయలుదేరారు. మార్గమధ్యంలో ఉన్నవ రోడ్డులోని మద్యం దుకాణానికి సమీపంలోని పొలాల్లోకి వెళ్లి మద్యం తాగుతున్నారు. అప్పటికే అక్కడ మరికొందరు మద్యం సేవిస్తున్నారు. వీరి మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. చివరకు అది అతనిపై దాడి చేసే వరకు వెళ్లింది. తెదేపా ప్రభుత్వ హయాంలో మద్యం ధరలు ఇంతగా లేవని, ప్రస్తుతం చేసిన చాకిరంతా దీనికే సరిపోతుందని బాధితుడు అనగా ప్రత్యర్థులు ఒక్కసారిగా అతనిపై బీరు సీసాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం పత్తి చేలో పడేసి వెళ్లిపోయారు. 40శాతానికి పైగా కాలిన గాయాలైన బాధితుడు వెంకట నారాయణ సోమవారం రాత్రి నుంచి ఘటన ప్రదేశంలోనే ఉన్నారు. మంగళవారం ఉదయం సమీపంలో ఉన్న నూలు మిల్లు వద్దకు వెళ్లారు. అక్కడి వాచ్‌మన్‌ చూసి 108కు సమాచారమివ్వగా వారు వచ్చి జీజీహెచ్‌లో చేర్పించారు.

తీవ్రంగా ఖండిస్తున్నా: లోకేశ్‌

దళితుడైన వెంకట నారాయణను మద్యం సీసాలతో కొట్టి నిప్పంటించిన రాక్షస మూకల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పేర్కొన్నారు. ‘తప్పును తప్పని చెబితే చంపేస్తారా? మనుషుల ప్రాణాలే తీసేస్తారా?’ అని ఆయన ప్రశ్నించారు.


రాజకీయ ప్రమేయం లేదు: డీఎస్పీ

నరసరావుపేట పట్టణం, గోరంట్ల (గుంటూరు)- న్యూస్‌టుడే: వెంకట నారాయణపై జరిగిన దాడిలో ఎలాంటి రాజకీయ కోణం లేదని డీఎస్పీ విజయభాస్కరరావు తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. మద్యం తాగి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని వెంకటనారాయణ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ‘సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టగా అతనికి సంబంధించిన పలు దొంగతనాలు వెలుగుచూశాయి. గతంలో ట్రాన్స్‌ఫార్మర్లలో తీగలు చోరీ చేసేవాడని విచారణలో తేలింది. నల్లపాడు, చిలకలూరిపేట, ప్రకాశం జిల్లాలోని జె.పంగులూరు, మార్టూరు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వెంకట నారాయణపై ఎవరూ దాడి చేయలేదని తీగలు దొంగిలించే క్రమంలో షాక్‌తగిలి గాయాలయ్యాయని విచారణలో తేలింది...’ అని వివరించారు.

* అంతకుముందు సాయంత్రం హోం మంత్రి మేకతోటి సుచరిత విలేకరులతో మాట్లాడారు. వెంకట నారాయణపై జరిగిన దాడి ఘటనపై కనీస అవగాహన లేకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారని వివరించారు.


బాధితుడు వెంకట నారాయణ ఏమన్నారంటే..

‘ఉన్నవ రోడ్డులోని దుకాణంలో మద్యం కొనుగోలు చేసి తాగడానికి సమీపంలోని స్థిరాస్తి వెంచర్‌లోకి వెళ్లా. అక్కడ గుర్తు తెలియని ఐదారుగురు దుర్భాషలాడుతూ నాపై దాడి చేశారు. మందు సీసాతో నా తలపై కొట్టి గాయపరిచారు. ఒళ్లంతా గాయాలైన నన్ను పత్తి చేలో పడేశారు. నేను స్పృహ కోల్పోయా. తర్వాత ఏం జరిగిందో తెలియదు. దాహం వేస్తుంటే మంచినీటి కోసం సమీపంలోని నూలు మిల్లులోకి వెళ్లా...’ అని వెంకటనారాయణ చెప్పారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని