
Hyderabad News: పోలీసుల కంట్లో కారం చల్లి.. తప్పించుకుని
ఈనాడు, హైదరాబాద్, రాజేంద్రనగర్, న్యూస్టుడే: ఉత్తరాఖండ్లో గ్రామ పెద్దను హత్యచేసి హైదరాబాద్లో తలదాచుకుంటున్న నిందితుడు... తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసుల కళ్లల్లో కారంచల్లి పారిపోయాడు. మంగళవారం రాత్రి రాజేంద్రనగర్ పోలీస్ఠాణా పరిధిలో ఈ సంఘటన జరిగింది. నిందితుడు పారిపోయేందుకు సహకరించడం, పోలీసుల విధి నిర్వహణలో ఆటంకం కలిగించినందుకు అతడి భార్య షమా పర్వీన్ను అరెస్ట్ చేసి ఉత్తరాఖండ్కు తరలించారు. వివరాలను రాజేంద్రనగర్ పోలీసులు వెల్లడించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లా గంగ్నహార్ ఠాణా పరిధిలో డిసెంబరు, 2019లో గ్రామపెద్ద కామ్రే ఆలంను హత్య చేశారు. ఈ కేసులో వాసీం అనే వ్యక్తి నిందితుడు. పోలీసులు అరెస్టు చేస్తారన్న ముందస్తు అంచనాతో నిందితుడు తన భార్య షమీంతో సహా వచ్చేశాడు. వాసీంను పట్టించిన వారికి రూ.10వేల బహుమతి ఇస్తామంటూ అక్కడి పోలీసులు ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం ఒక వ్యక్తి ద్వారా అతడు హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉంటున్నాడని కచ్చితమైన సమాచారం తెలుసుకున్నారు. ఉత్తరాఖండ్ ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఎస్సై బిల్వర్సింగ్ ఇద్దరు కానిస్టేబుళ్లు మంగళవారం సాయంత్రం రాజేంద్రనగర్ పోలీస్ ఠాణాకు వచ్చారు. పోలీసులకు విషయాన్ని వివరించగా.. వారు సహకరిస్తామన్నారు. మొత్తం ఆరుగురు పోలీసులు వాసీం ఉంటున్న ఇంటికి మంగళవారం రాత్రి వచ్చారు. పోలీసులు వస్తున్నారన్న విషయం గ్రహించిన నిందితుడు ఇంట్లోకి వెళ్లి.. రెండుచేతుల్లో కారంపొడిని తీసుకున్నాడు. ఈలోపు అతడి భార్య, మరో మహిళ పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బయటకువచ్చిన వాసీం.. పోలీసుల కళ్లల్లో కారం చలి అక్కడి నుంచి పారిపోయాడు. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన కానిస్టేబుల్ చమన్కుమార్, రాజేంద్రనగర్ కానిస్టేబుల్ ఫయాజ్ కళ్లలో కారం పడి ఇబ్బంది పడ్డారు.