Crime News: ఇన్నోవాలో వచ్చి పోలీసులమంటూ బెదిరిస్తారు.. గొర్రెలన్నీ ఎత్తుకెళ్తారు!

తెల్లవారుజామున ఇన్నోవాలో తిరుగుతూ జాతీయ రహదారిపై కాపు కాస్తారు. గొర్రెలను తీసుకొని మార్కెట్లో అమ్మడానికి వెళ్తున్న వాహనాలనే లక్ష్యంగా..

Updated : 19 Jan 2022 10:17 IST

సంగారెడ్డి: తెల్లవారుజామున ఇన్నోవాలో తిరుగుతూ జాతీయ రహదారిపై కాపు కాస్తారు. గొర్రెలను తీసుకొని మార్కెట్లో అమ్మడానికి వెళ్తున్న వాహనాలనే లక్ష్యంగా చేసుకుంటారు. వాహనాన్ని అడ్డుకుని, గొర్రెలను ఎక్కడకు తీసుకెళ్తున్నారు? అన్ని రకాల పత్రాలున్నాయా? అంటూ హడావుడి చేస్తారు. వాహనంలోని వారిని ఇన్నోవాలో ఎక్కించుకొని బెదిరించి ఉన్నదంతా దోచుకొని రోడ్డుపై విడిచిపెడతారు. ఈలోగా మిగతా ముఠా సభ్యులు గొర్రెలను వేరే వాహనంలో తరలించి అమ్మేస్తారు. ఇదీ 52 కేసులున్న ఖాజా వహబుద్దీన్‌ ముఠా నేరాలు చేసే తీరు. ముఠా గుట్టు లాగిన తీరుపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్‌ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. చాంద్రాయణగుట్టకు చెందిన ఖాజా వహబుద్దీన్‌ (45) ఆరుగురితో ముఠాను ఏర్పాటు చేశాడు. మధ్యప్రదేశ్‌ నుంచి పిస్టోల్‌, బుల్లెట్లను కొనుగోలు చేశాడు. గత నెల 8న మహారాష్ట్రకు చెందిన మహదేవ్‌ బీరూ గోడ్కే తన బొలెరోలో గొర్రెలను జియాగూడ మార్కెట్‌కు తీసుకెళ్తున్నారు. తెల్లవారుజామున ఇన్నోవాలో వచ్చిన వహబుద్దీన్‌ ముఠా సభ్యులు వాహనాన్ని ఆపి బెదిరించి గొర్రెలను ఎత్తుకెళ్లిపోయారు. ఈ నెల 13న మహారాష్ట్రకు చెందిన షేక్‌ తస్లీం దేశ్‌ముఖ్‌ తన డ్రైవర్‌ కిషన్‌ భజరంగ్‌, మరో వ్యక్తి హనుమాన్‌తో కలిసి గొర్రెలను జియాగూడ మార్కెట్‌కు తరలిస్తున్నారు. పటాన్‌చెరు మండలం రుద్రారంవద్ద ఇన్నోవాలో వచ్చి బాధితుల వద్ద  రూ.7వేలు, సెల్‌ఫోన్లు లాక్కొన్నారు. వీటిపై పోలీసులు దృష్టి సారించి... ఖాజా వహబుద్దీన్‌తోపాటు అతడికి సహకరించిన మహ్మద్‌ తాజుద్దీన్‌ (27), మహ్మద్‌ ఇసాక్‌ (33), మహ్మద్‌ అనీఫ్‌ (35)లను అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక పిస్టోలు, రెండు కత్తులు, ఏడు బుల్లెట్లు, రూ.1.51లక్షల నగదు, రూ.3.20లక్షల విలువ చేసే 60 గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు. ఖాజా వహబుద్దీన్‌పై ఇప్పటికే 52 కేసులు నమోదయ్యాయి. ముఠాకు సహకరించిన తైమూరు, అమీర్‌, షేక్‌ ఇమ్రాన్‌లు పరారీలో ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని