Crime News: వారసురాలినంటూ రూ.2 కోట్ల స్థలానికి ఎసరు

ఉప్పల్‌లో ముగ్గురు మహిళలు కలిసి సుమారు రూ.2 కోట్ల విలువైన స్థల కబ్జాకు పాల్పడ్డారు. నకిలీ డాక్యుమెంట్లతో ఏకంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకొని చివరకు కటకటాలపాలైన ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ గోవింద్‌రెడ్డి కథనం ప్రకారం

Updated : 26 Feb 2022 11:53 IST

తల్లీకూతురితో పాటు మరో మహిళ అరెస్టు

ఉప్పల్‌, న్యూస్‌టుడే: ఉప్పల్‌లో ముగ్గురు మహిళలు కలిసి సుమారు రూ.2 కోట్ల విలువైన స్థల కబ్జాకు పాల్పడ్డారు. నకిలీ డాక్యుమెంట్లతో ఏకంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకొని చివరకు కటకటాలపాలైన ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ గోవింద్‌రెడ్డి కథనం ప్రకారం.. సరూర్‌నగర్‌ మండలం ఆర్‌కే పురానికి చెందిన 71ఏళ్ల పచ్చిపులుసు వరలక్ష్మికుమారికి రామంతాపూర్‌లోని శ్రీరమణపురంలో 267 గజాల ఇంటి స్థలం ఉంది. దీనిని 1983లోనే శ్రీరమణ కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ నుంచి ప్లాట్‌ను కొనుగోలు చేసి చుట్టూ ప్రహరీ నిర్మించారు. 2011లో ఆమె భర్త మల్లికార్జునరావు మృతి చెందడంతో అప్పటి నుంచి ఆమె సోదరుడు మల్లేశ్వరరావు ప్లాట్‌ను చూసుకుంటున్నారు.

తానే ఏకైక కూతురునంటూ..

ఉప్పల్‌ డివిజన్‌లోని చర్చికాలనీలో ఉండే పసల జ్యోతి(33), మరో కొందరికి ఈ స్థలంపై కన్ను పడింది. దీంతో 2014లోనే వరలక్ష్మి మృతి చెందినట్లు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం బయ్యారం గ్రామం నుంచి మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించారు. ఆమెకు ఏకైక కూతురిని తానేనంటూ జ్యోతి నటించడం ప్రారంభించింది. గతేడాది డిసెంబరు 3న జ్యోతి తన కూతురు వెన్నెల(19)కు గిఫ్ట్‌ డీడ్‌ చేసింది. వెన్నెల అదే నెల 9న గొల్లపూడి మరియమ్మకు సేల్‌ డీడ్‌ చేసింది. అంతటితో ఆగకుండా అదే నెల 18న మరియమ్మ మళ్లీ పసల జ్యోతితో పాటు చిలుకానగర్‌లోని ఆదర్శనగర్‌కు చెందిన బల్ల జ్యోతి(27)కి సేల్‌ డీడ్‌ చేసింది. ఇటీవల వరలక్ష్మికి సంబంధించిన వారు ప్లాట్‌ వద్దకు రావడంతో జ్యోతికి సంబంధించి వారు ప్లాట్‌ తమదేనన్నారు. దీంతో వారు ఉప్పల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి చూడగా అసలు విషయం తెలిసింది. వాస్తవానికి వరలక్ష్మికి కూతురు, కొడుకు ఉన్నారు. ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఫోర్జరీ సంతకం.. నకిలీ డాక్యుమెంట్లు..

బయ్యారం గ్రామ పంచాయితీ సెక్రటరీ వరలక్ష్మి మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చినట్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సమర్పించింది నకిలీదని పోలీసులు తేల్చారు. పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు.అంతేకాకుండా జ్యోతి ఏకైక కూతురినంటూ సృష్టించిన ఆధార్‌ కార్డులో కూడా ఆమె భర్త  విజయ్‌కుమార్‌ పేరును తొలగించి మల్లికార్జునరావు పేరును చేర్చింది. ఇవ్వన్నీ కూడా నకిలీ ధ్రువీకరణ పత్రాలుగా పోలీసులు విచారణలో తేలింది.

12 మందిపై కేసు..

ప్లాట్‌ కబ్జా కేసులో శుక్రవారం పసల జ్యోతి, ఆమె కూతురు వెన్నెల, బల్ల జ్యోతిని అరెస్టు చేశారు. ఈ ముగ్గురే కాకుండా బల్ల బలరాం, గొల్లపూడి మరియమ్మ, పసల గ్రెగోరి, జంపరపు ఇమ్మానుయేల్‌, గొల్లపూడి జోసెఫ్‌కుమార్‌, మమేని ఈంశనమ్మ, గంగారపు శ్రవణ్‌, మమేని రాయన్న, మల్లికార్జున్‌ పరారీలో ఉన్నారు. మొత్తం 12 మందిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని