బతికుండగానే అక్కాచెల్లెళ్లను చంపేశాడు!

అక్కాచెల్లెళ్లు చనిపోయారని మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి వారి భూమిని సోదరుడు తన కుమార్తె పేర అక్రమంగా పట్టా చేసుకొన్న సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది.

Updated : 11 Mar 2022 04:49 IST

మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి భూమిని పట్టా చేసుకున్న సోదరుడు

కోడేరు, న్యూస్‌టుడే : అక్కాచెల్లెళ్లు చనిపోయారని మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి వారి భూమిని సోదరుడు తన కుమార్తె పేర అక్రమంగా పట్టా చేసుకొన్న సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. మండలంలోని ఎత్తం గ్రామానికి చెందిన గొల్ల ఈరయ్యకు కుమారుడు గొల్ల బాలయ్యతోపాటు ఇద్దరు కుమార్తెలు లక్ష్మి, బాలచంద్రమ్మ ఉన్నారు. పదేళ్ల కిందట ఈరయ్య.. పుసుపుకుంకుమ కింద కుమార్తె బాలచంద్రమ్మకు నాగులపల్లి రెవెన్యూ పరిధిలో 0.33 ఎకరాలు, మరో కుమార్తె లక్ష్మికి 0.27 ఎకరాలు పట్టా చేశారు. వారికి కొత్త పాసుపుస్తకాలతోపాటు రైతుబంధు డబ్బులూ వచ్చాయి. ఈ ఏడాది యాసంగిలో రైతుబంధు డబ్బులు ఖాతాల్లో పడకపోవడంతో మీసేవ కేంద్రానికి వెళ్లి చూసుకోగా.. వారి పేర భూములు కనిపించలేదు. అనుమానం వచ్చిన బాధితులు కోడేరు తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి ఆరా తీశారు. 2016 మార్చి 27న బాలచంద్రమ్మ, 2016 మార్చి 21న లక్ష్మి చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన సోదరుడు బాలయ్య తన కుమార్తె రామలక్ష్మి పేరిట 2021 సెప్టెంబరు 21న విరాసత్‌ పట్టా మార్చిడి చేసినట్లు తేలింది. తామింకా బతికే ఉన్నామని పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డులు చూయించడంతో తహసీల్దార్‌ అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి బాధితులతో ఫిర్యాదు చేయించారు. ఈ విషయమై తహసీల్దార్‌ మల్లికార్జున్‌రావును వివరణ కోరగా.. తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలతో సోదరుడే పట్టా మార్పిడి చేసుకున్నారని తెలిపారు. ఇది తాను మండలానికి రాకముందే జరిగిందన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని