Crime News: ఓడిపోయా.. బతకాలని లేదు..!

‘అమ్మా...నాన్నా మళ్లీ మీ ముందు ఓడిపోయా...అందరి ముందూ ప్రశ్నగా మిగిలిపోయా... పెద్దమనుషుల సమక్షంలో మళ్లీ ఆర్నెల్లు గడువు పెడితే తనను నమ్మి మరోసారి ఓడిపోయా.. ఏం చేయాలో అర్థంకాట్లేదు...

Published : 16 Mar 2022 05:39 IST

ఉరేసుకుని యువతి ఆత్మహత్య 

దంతాలపల్లి, న్యూస్‌టుడే: ‘అమ్మా... నాన్నా మళ్లీ మీ ముందు ఓడిపోయా... అందరి ముందూ ప్రశ్నగా మిగిలిపోయా...పెద్దమనుషుల సమక్షంలో మళ్లీ ఆర్నెల్లు గడువు పెడితే తనను నమ్మి మరోసారి ఓడిపోయా.. ఏం చేయాలో అర్థంకాట్లేదు... నాకు బతకాలని లేదు’ అంటూ లేఖ రాసి ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్దముప్పారం గ్రామానికి చెందిన పోలెపల్లి వెంకన్న-శారద దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె శరణ్య(22) ఇంటర్మీడియెట్‌ చదివారు. కుట్టుమిషన్‌ నేర్చుకుని ఇంటి వద్దే ఉంటున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడ్ని ప్రేమించింది. ఆ యువకుడు ఓ పార్టీ యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ, కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పెళ్లి చేసుకునే క్రమంలో వీరి మధ్య సమస్య తలెత్తింది. దీంతో ఇటీవల పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఆ యువకుడు పెళ్లి చేసుకునేందుకు మరో ఆరునెలలు గడువు పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ప్రేమించి మోసపోయి... ఓడిపోయానంటూ సదరు యువకుడి ఊహాచిత్రాన్ని గీసి లేఖ రాసిపెట్టింది. ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని లేఖను, ఆత్మహత్యకు వినియోగించిన చున్నీని స్వాధీనం చేసుకున్నారు. 

యువకుడి ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన 

యువతి మృతికి ప్రేమించిన యువకుడే కారణమంటూ, బాధిత కుటుంబానికి న్యాయం చేసి బాధ్యుడైన యువకుడిని కఠినంగా శిక్షించాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు మృతదేహంతో యువకుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. యువతి మృతిపై తమకు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై మురళీధర్‌రాజు తెలిపారు. పరిస్థితిని సీఐ కరుణాకర్‌ పర్యవేక్షిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని