Crime News: మీ వయసెంతైనా సరే.. పెళ్లాడతా

‘‘నాపేరు ఇందుషా తుమ్మల.. మాది విజయవాడ. డిగ్రీ చదివినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా పెళ్లికాలేదు. ఫేస్‌బుక్‌ ద్వారా మీరు పరిచయమయ్యాక మిమ్మల్ని పెళ్లిచేసుకుందామని నిర్ణయించుకున్నాను. మీ వయస్సు నాకంటే రెట్టింపైనా నాకు అభ్యంతరం లేదు.

Updated : 12 May 2022 05:41 IST

వ్యాపారికి వలపు వల విసిరి రూ.45లక్షలు స్వాహా
నూజివీడు వాసి అరెస్ట్‌

నిందితుడు మోతే అశోక్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘నాపేరు ఇందుషా తుమ్మల.. మాది విజయవాడ. డిగ్రీ చదివినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా పెళ్లికాలేదు. ఫేస్‌బుక్‌ ద్వారా మీరు పరిచయమయ్యాక మిమ్మల్ని పెళ్లిచేసుకుందామని నిర్ణయించుకున్నాను. మీ వయస్సు నాకంటే రెట్టింపైనా నాకు అభ్యంతరం లేదు. ఏదైనా దేవాలయానికి వెళ్లి ఇద్దరం ఒక్కటవుదా’’మంటూ యువతిలా పరిచయం చేసుకుని.. అమ్మాయిలా మాట్లాడి జూబ్లీహిల్స్‌లో ఉంటున్న ఓ వ్యాపారి నుంచి రూ.45లక్షలు కాజేసిన నిందితుడు మోతే అశోక్‌ను హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి రూ.2లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను బుధవారం సీపీ సీవీ ఆనంద్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన మోతే అశోక్‌ ఫేస్‌బుక్‌లో అందమైన యువతి పేరుతో ఖాతా తెరిచి జూబ్లీహిల్స్‌ వ్యాపారిని రెండేళ్ల క్రితం పరిచయం చేసుకున్నాడని, దశలవారీగా అతడి నుంచి రూ.45లక్షలు తీసుకున్నాడని, వ్యాపారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మోసం బహిర్గతమైందని వివరించారు.

యూట్యూబ్‌ చూసి.. వాయిస్‌యాప్‌ వాడి
నూజివీడులో నివాసముంటున్న అశోక్‌ ఇంజినీరింగ్‌ మధ్యలోనే వదిలేశాడు. చెడు అలవాట్లకు బానిసై డబ్బు కోసం మోసాలు చేయాలనుకున్నాడు. ఎలా మోసం చేయాలని యూట్యూబ్‌లో వీడియోలు చూశాడు. ఓ యువతి ఫొటోను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇందుషా తాళ్లూరి పేరుతో 2020 ఫిబ్రవరిలో ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచాడు. జూబ్లీహిల్స్‌ వ్యాపారికి రిక్వెస్ట్‌ పంపాడు. ఫేస్‌బుక్‌ పరిచయం తర్వాత వ్యాపారితో ‘‘వాయిస్‌ ఛేంజ్‌’ యాప్‌ ద్వారా యువతిలా మాట్లాడాడు. విజయవాడకు వస్తే ఏకాంతంగా గడుపుదామంటూ ఆహ్వానించేవాడు. వచ్చేవారంలో వస్తున్నానని వ్యాపారి అంటే.. వేరే పనులున్నాయంటూ దాటవేసేవాడు.

ఫీజు కట్టాలి.. అమ్మకు కరోనా అంటూ..
వ్యాపారి తన మాటలకు ఆకర్షితుడయ్యాడని తెలుసుకున్న అశోక్‌ కళాశాలలో ఫీజు కట్టాలంటూ రూ.3లక్షలు తీసుకున్నాడు. తొలి దశలో తన తల్లికి కరోనా సోకిందని, డబ్బు సాయం చేయాలంటూ రూ.10లక్షలు, రెండోదశ తనకు కూడా సోకిందని రూ.15లక్షలు తీసుకున్నాడు. తరచూ డబ్బు కోసం ఫోన్‌ చేస్తుండడంతో బాధితుడికి అనుమానం వచ్చి 20 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్‌ జి.వెంకటరామిరెడ్డి దర్యాప్తు చేపట్టి సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుణ్ని గుర్తించారు. నూజివీడుకు వెళ్లి బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అశోక్‌ ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌లు, మద్యం తాగేందుకు రూ.43లక్షలు ఖర్చుచేశాడని ఇన్‌స్పెక్టర్‌ వివరించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని