మాయలేడీ లీలలెన్నో..

ఉద్యోగాల పేరిట ఘరానా మోసానికి పాల్పడ్డ మాయలేడీ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిరుద్యోగుల్ని నిండా ముంచడమే కాకుండా రైల్వే కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మబలికి ఉద్యోగుల నుంచి భారీగా దండుకున్నట్లు తేలింది. రూ.5

Updated : 28 May 2022 06:51 IST

రైల్వే కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ భారీ టోకరా

ఈటీవీ, ఖమ్మం

ద్యోగాల పేరిట ఘరానా మోసానికి పాల్పడ్డ మాయలేడీ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిరుద్యోగుల్ని నిండా ముంచడమే కాకుండా రైల్వే కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మబలికి ఉద్యోగుల నుంచి భారీగా దండుకున్నట్లు తేలింది. రూ.5 లక్షలకు తగ్గకుండా అప్పు ఇచ్చిన వారికి అధిక మొత్తంలో వడ్డీలు చెల్లిస్తానంటూ డబ్బున్న వారి నుంచీ భారీగానే సొమ్ము కూడబెట్టింది. ఆమె మోసాలకు బలైన బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఖమ్మం జిల్లాలోనే కాదు హైదరాబాద్‌ వరకూ బాధితులున్నట్లు తెలుస్తోంది. భర్త పోలీసు ఉద్యోగన్న ధీమాతోనే మోసాల పరంపర కొనసాగించినట్లు పోలీసులు భావిస్తున్నప్పటికీ.. భర్తకు తెలిసి జరిగిందా? లేదా? అన్నది తేలలేదు. ‘ఈనాడు-ఈటీవీ తెలంగాణ’ కథనంతో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం.. నిందితురాలుతోపాటు ఆమె భర్తనూ శుక్రవారం ఠాణాకు తీసుకొచ్చి ప్రశ్నించారు.

బాధితులెందరో..
ఉద్యోగాల పేరిట రూ.కోటికిపైగా దండుకున్న ఆమె రైల్వే కాంట్రాక్టులు ఇప్పిస్తానని డబ్బున్న ఉద్యోగుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డట్టు తేలింది.   వైరాలోని పోలీసు శాఖలో పనిచేసే సిబ్బంది ఇద్దరు ఇలా మోసపోయారు. ఒక్కొక్కరి నుంచి రూ.25 లక్షలు వసూలు చేసింది. ఇంకా ఆసక్తి ఉన్న వారి నుంచీ పెట్టుబడులు పెట్టేలా చూడాలని వారిద్దరినీ కోరగా తమ బంధువులు, స్నేహితుల నుంచి సుమారు రూ.30 లక్షల వరకు ఇప్పించారు. ఇలా ఒక్క వైరా నుంచే రైల్వే కాంట్రాక్టుల పేరిట రూ.80 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఖమ్మం, తిరుమలాయపాలెంతోపాటు హైదరాబాద్‌ నుంచి మహిళ ఉచ్చులో పడ్డ బాధితులున్నారు. ఆమె చేతిలో మోసపోయిన పలువురు బాధితులు శుక్రవారం ఠాణాకు వచ్చినట్లు తెలిసింది. తామే కాకుండా తమకు తెలిసిన వారు స్నేహితులు, బంధువుల కుటుంబీకులతో డబ్బులు ఇప్పించామని.. వారు తమపై ఒత్తిడి తెస్తున్నారని.. ఎలాగైనా డబ్బు ఇప్పించాలని పోలీసులను కోరినట్లు తెలిసింది.


పోలీసుల ప్రశ్నల వర్షం

బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి భర్త హైదరాబాద్‌ పోలీస్‌శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్నట్లు గుర్తించి ఆయన్ను ఠాణాకు తీసుకొచ్చారు. శుక్రవారం ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళ నేర ప్రవృత్తిపై పూర్తిస్థాయిలో ఆరా తీశారు. గతంలోనూ పలు స్టేషన్లలో మహిళపై కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఉద్యోగాలు, కాంట్రాక్టుల పేరిట మొత్తం ఎంతమంది నుంచి డబ్బు వసూలు చేశారు? బాధితులంతా ఎక్కడెక్కడి వారు? మహిళ వెనుక ఎవరైనా ఉన్నారా? అన్న కోణాల్లో విచారణ జరిపినట్లు తెలిసింది. ఇక పోలీసు శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమె భర్తపైనా అనేక కోణాల్లో ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఆయకు తెలియకుండానే ఈ మోసాలకు పాల్పడిందా అన్న కోణంలో విచారించారు. భార్య చేసిన మోసాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని భర్త చెప్పినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని