భార్యాబిడ్డను హతమార్చి..ఆపై ఆత్మహత్య

కుటుంబ కలహాలతో భార్య, అయిదు నెలల పసికందును గొంతు నులిమి హతమార్చిన భర్త ఆపై ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఇస్కపల్లిపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది.

Updated : 08 Aug 2022 04:19 IST

ఇస్కపల్లిలో విషాదం

అల్లూరు, న్యూస్‌టుడే : కుటుంబ కలహాలతో భార్య, అయిదు నెలల పసికందును గొంతు నులిమి హతమార్చిన భర్త ఆపై ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఇస్కపల్లిపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఏడాదిన్నర కిందట గ్రామానికి చెందిన ఆవుల మురళి (25), స్వాతి (20)కి వివాహమైంది. వారికి అయిదు నెలల పాప ఉంది. భార్యాభర్తల మధ్య వివాదాల కారణంగా కొన్ని రోజులుగా స్వాతి పుట్టింట్లో ఉంటోంది. ఆమెను ఇంటికి తీసుకొచ్చేందుకు భర్త పలుమార్లు యత్నించినా వీలు కాలేదు. ఈనెల 4న అతని అక్క వెంకటరమణమ్మ స్వాతికి నచ్చజెప్పి భర్త వద్దకు తీసుకొచ్చారు. శనివారం రాత్రి భార్య, భర్త, పాప ఇంట్లోనే ఉన్నారు. ఆదివారం ఉదయం చాలా సేపటి వరకు తలుపులు తీయకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో తలుపులు పగలగొట్టి చూడగా.. అప్పటికే తల్లి, పాప మృతిచెందగా మురళి ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ కుమార్తె, మనుమరాలిని మామ గోవిందు, అత్త బంగారమ్మ, ఆడబిడ్డ వెంకటరమణమ్మ కలిసి హత్య చేశారని అల్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఆమె తండ్రి గోవిందు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెపై ఇష్టం లేకుంటే ఇంటికి పంపాల్సిందని, ఇలా హతమార్చడం దారుణమని తండ్రి బోరున విలపించారు. కుటుంబంలో ముగ్గురు మృతిచెందడంతో స్థానికంగా విషాదం అలముకుంది. కావలి ఇన్‌ఛార్జి డీఎస్పీ శ్రీహరి, కావలి గ్రామీణ సీఐ ఖాజావలి, అల్లూరు ఎస్సై శ్రీనివాసులురెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


మృతదేహాల వద్ద విలపిస్తున్న కుటుంబసభ్యులు.. మురళి, స్వాతి (పాతచిత్రం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని