దొంగల ముఠా నాయకుడి అరెస్టు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అపార్ట్‌మెంట్లు, తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న కేసులో ముఠా నాయకుడిని వరంగల్‌ సీసీఎస్‌, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. సోమవారం కమిషనరేట్‌లో సీపీ తరుణ్జోషి నిందితుడి వివరాలు వెల్లడించారు. హరియాణా రాష్ట్రం బివాని

Updated : 09 Aug 2022 05:23 IST

నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న సీపీ తరుణ్‌జోషి, చిత్రంలో డీసీపీ అశోక్‌ కుమార్‌, అదనపు

డీసీపీలు వైభవ్‌ గైక్వాడ్‌, పుష్పారెడ్డి, ఇతర పోలీస్‌ అధికారులు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అపార్ట్‌మెంట్లు, తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న కేసులో ముఠా నాయకుడిని వరంగల్‌ సీసీఎస్‌, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. సోమవారం కమిషనరేట్‌లో సీపీ తరుణ్జోషి నిందితుడి వివరాలు వెల్లడించారు. హరియాణా రాష్ట్రం బివాని జల్లా భాన్గర్‌ గ్రామానికి చెందిన పరమేందర్‌సింగ్‌, సాధు, పవన్‌ దేశవ్యాప్తంగా కార్లలో తిరుగుతూ ఇళ్లల్లో చోరీలు చేసేవారు. ఈ క్రమంలో హసన్‌పర్తి, కేయూసీ 2, మిల్స్‌కాలనీ పరిధిలో ఒకటితో పాటుగా రాష్ట్రంలోని సూర్యాపేటలో 1, ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లా బాలజీనగర్‌, దర్గామిట్ట ఠాణాల పరిధిలో ఒక్కో చోరీ చేశారు. కమిషనరేట్‌లో పోలీసులు నిఘా పెట్టి చోరీలు జరిగిన ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలు, వేలిముద్రలను పరిశీలించి నిందితులను గుర్తించారు. దీంతో పాటు దిల్లీ, హరియాణా రాష్ట్ట్ర్రం హిస్సార్‌, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలకు కమిషనరేట్‌ పోలీసులు వెళ్లి అక్కడ వివరాలు సేకరించారు. అక్కడ నిందితులు లేకపోవడంతో సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా పెంచి సోమవారం వరంగల్‌ నగరంలో ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పెద్దమ్మగడ్డ వద్ద రెండు కార్లలో గుర్తించి పట్టుకున్నారు. మిగిలిన ఇద్దరు నిందితులు సాధు, పవన్‌ పోలీసులను చూసి పారిపోగా పరమేందర్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించాడు. నిందితుడి నుంచి రూ.52 లక్షల విలువైన 1033 గ్రాముల బంగారం, రెండు కార్లు, చరవాణి, స్క్రూ డ్రైవర్‌, కట్టర్‌, సుత్తిని స్వాధీనం చేసుకొని వరంగల్‌ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అశోక్‌కుమార్‌, అదనపు డీసీపీ కె.పుష్పారెడ్డి, ఏసీపీలు డేవిడ్‌రాజ్‌, కిరణ్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్లు, రమేశ్‌కుమార్‌, శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్‌జీ, ఎస్సైలు అక్రం, రాజ్‌కుమార్‌, రాజేందర్‌, సహాయక అనలటిక్‌ అధికారి సల్మాన్‌ పాషాను సీపీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని