Hyderabad News: ఊరెళ్లొద్దంటే చంపేశాడు.. 17 రోజులకు వీడిన జంట హత్యల మిస్టరీ

ఉపాధి దొరకలేదని.. తిరిగి వెళ్తానంటే.. వెళ్లనివ్వలేదని కోపంతో ఇద్దర్ని హతమార్చాడు. ఆపై గ్యాస్‌సిలిండర్లను పేల్చి ఆత్మహత్య చేసుకోవాలనుకొని ధైర్యం చాలక కిటికీ నుంచి దూకి పారిపోయాడు. జీడిమెట్ల ఠాణా రాంరెడ్డినగర్‌లో సంచలనం

Updated : 12 Aug 2022 08:14 IST

జీడిమెట్ల, న్యూస్‌టుడే: ఉపాధి దొరకలేదని.. తిరిగి వెళ్తానంటే.. వెళ్లనివ్వలేదని కోపంతో ఇద్దర్ని హతమార్చాడు. ఆపై గ్యాస్‌సిలిండర్లను పేల్చి ఆత్మహత్య చేసుకోవాలనుకొని ధైర్యం చాలక కిటికీ నుంచి దూకి పారిపోయాడు. జీడిమెట్ల ఠాణా రాంరెడ్డినగర్‌లో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసు 17 రోజుల తర్వాత చిక్కుముడి వీడింది. గురువారం జీడిమెట్ల ఠాణాలో సీఐ ఎం.పవన్‌, ఎస్సై గౌతమ్‌తో కలిసి బాలానగర్‌ ఏసీపీ గంగారం వివరాలు వెల్లడించారు. ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన బీరేంద్రకుమార్‌ జీడిమెట్లలోని ఓ పరిశ్రమలో పనిచేశాడు. సొంతూరికి వెళ్లి గతనెల 26న.. 9 మందిని వెంటబెట్టుకుని నగరానికి వచ్చాడు. వారికి పని కల్పించాలని ఓ పరిశ్రమకు వెళ్లాడు. కేవలం ఐదుగురు మాత్రమే ఎంపికయ్యారు. ఇబాదత్‌ అన్సారీ, ఇమాముద్దీన్‌, కలీముద్దీన్‌, భునేశ్వర్‌సింగ్‌ను తీసుకొని రాంరెడ్డినగర్‌లోని గదికి వెళ్లారు. భునేశ్వర్‌సింగ్‌ తిరిగి సొంతూరికి వెళ్తానని బీరేంద్రకుమార్‌ వద్దని చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఇమాముద్దీన్‌, కలీముద్దీన్‌ మరో గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. గొడవ తీవ్రం కావడంతో సహనం కోల్పోయిన భునేశ్వర్‌.. కట్టెతో బీరేంద్రకుమార్‌ తలపై కొట్టాడు. ఇబాదత్‌ అన్సారీ అడ్డుకోగా అతన్నీ విచక్షణా రహితంగా కొట్టడంతో ఇద్దరూ మృతిచెందారు. నిందితుడు తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. వెంటనే అక్కడున్న రెండు గ్యాస్‌ సిలిండర్లను లీక్‌ చేసి నిప్పంటించాడు. మంటలు వ్యాపించడంతో భయంతో కిటికీలో నుంచి దూకి పారిపోయాడు. పక్కన గదిలో ఉన్న ఇమాముద్దీన్‌, కలీముద్దీన్‌.. పేలుడు ధాటికి భయపడి కిటికీలో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. భునేశ్వర్‌సింగ్‌ ఝార్ఖండ్‌లోని బంధువుల ఇంట్లో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి అతన్ని పట్టుకొచ్చి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని