ద్విచక్ర వాహనం ఢీకొని చిన్నారి దుర్మరణం

అప్పటి వరకు సంతోషంగా ఉన్న చిన్నారి ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Updated : 24 Nov 2022 05:31 IST

లక్ష్మీదేవిపల్లి, న్యూస్‌టుడే: అప్పటి వరకు సంతోషంగా ఉన్న చిన్నారి ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సరదాగా తనతో పాటు ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని తీసుకెళ్తున్న ఒక్కగానొక్క కుమార్తె కళ్ల ముందే మృతి చెందడంతో ఆ తండ్రి తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. ఈ సంఘటన బుధవారం అనిశెట్టిపల్లి ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు... టేకులపల్లి మండలం తడికలపూడికి చెందిన మహ్మద్‌ సమీర్‌, షరీఫా దంపతుల ఏకైక కుమార్తె మహ్మద్‌ ఫాతిమ ముస్కాన్‌(2). సమీర్‌ కోయగూడెం ఓసీలో ఒప్పంద కార్మికుడిగా పని చేస్తున్నారు. భద్రాచలంలో ఉండే వారి బంధువుల ఇంటికి వెళ్లేందుకు సమీర్‌ కుమార్తె ఫాతిమతో కలిసి బుధవారం ద్విచక్ర వాహనంపై తడికలపూడి నుంచి బయలుదేరారు. ఇదే సమయంలో మణుగూరు సింగరేణి ఓసీలో విధులు నిర్వహించే గగులోత్‌ రవి, స్నేహితుడు వెంకటేశ్వరరావుతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇల్లెందు వైపు వస్తున్నారు. అనిశెట్టిపల్లి ప్రధాన రహదారి వద్ద ఎదురుగా వస్తున్న సమీర్‌ ద్విచక్ర వాహనాన్ని రవి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో వాహనంపై ఉన్న ఫాతిమ ఒక్కసారిగా కింద పడటంతో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సమీర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆటోలో కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చిన్నారి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు లక్ష్మీదేవిపల్లి పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని