రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

రహదారిపై వెళుతున్న లారీకి అడ్డువచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పక్కనున్న రెండు ఆటోలను ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు.

Updated : 24 Nov 2022 06:27 IST

కొక్కంటిక్రాస్‌ (తనకల్లు), న్యూస్‌టుడే: రహదారిపై వెళుతున్న లారీకి అడ్డువచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పక్కనున్న రెండు ఆటోలను ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన బుధవారం కొక్కంటిక్రాస్‌లోని 42 జాతీయ రహదారిపై బస్టాండు కూడలిలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలు... కదిరి వైపు నుంచి తమిళనాడుకు ద్విచక్ర వాహనాల రవాణా లారీ వెళ్తోంది. కొక్కంటిక్రాస్‌ బస్టాండు కూడలిలోకి రాగానే కొక్కంటి రహదారిలో మండలంలోని మించలవారికోటకు చెందిన రమణ ద్విచక్ర వాహనంలో జాతీయ రహదారిలోకి ప్రవేశించాడు. గుర్తించిన లారీ చోదకుడు అతణ్ని తప్పించబోయి రహదారి పక్కనున్న రెండు ఆటోలను ఢీకొనడంతో అందులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మండలంలోని మార్పూరివాండ్లపల్లికి చెందిన సుబ్బరాయుడు (65) స్వగ్రామానికి వెళ్లేందుకు ఒక ఆటోలో ఉండగా, మరో ఆటోలో ఉస్తినపల్లికి చెందిన హుసేన్‌బాషా (35) పండ్లు అమ్ముకుంటుండగా లారీ ఢీకొని మృత్యువాతపడ్డారు. ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారుడు గాయపడటంతో కదిరికి తరలించారు. ఘటనా ప్రాంతంలో మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎస్సై రాంభూపాల్‌, సిబ్బంది లారీ చోదకుణ్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని